డేరా 'ఖతమ్': అవన్నీ మూతపడ్డాయి.. ఇప్పుడదో చీకటి గుహ.. ఇదీ పరిస్థితి!
800 ఎకరాల్లో విస్తరించి ఉన్న డేరా సామ్రాజ్యంలో దాదాపు రూ. 2,100 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం ఉంది. గుర్మీత్ అరెస్టుతో ఈ ఉత్పత్తులన్ని ఒక్కసారిగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: అరాచకాలు.. అమానుషాలకు నెలవుగా మారి.. ఎట్టకేలకు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టుతో డేరా చీకటి సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video
దైవంగా పూజలు అందుకున్న బాబా కాస్తా ఇప్పుడు జైల్లో మగ్గిపోవడంతో డేరా సామ్రాజ్యం చిన్నబోయింది. డేరా చుట్టూ అల్లుకున్న వేల కోట్ల రూపాయల బిజినెస్ స్తంభించిపోయింది. ప్రస్తుతం డేరా సామ్రాజ్యం వట్టి చీకటి గుహను తలపిస్తున్నట్టు తెలుస్తోంది.
నిలిచిపోయిన బిజినెస్
800 ఎకరాల్లో విస్తరించి ఉన్న డేరా సామ్రాజ్యంలో దాదాపు రూ. 2,100 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం ఉంది. గుర్మీత్ అరెస్టుతో ఈ ఉత్పత్తులన్ని ఒక్కసారిగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అలోవీరా ఉత్పత్తులు, వాటర్ బాటిళ్లు, కార్ బ్యాటరీలు, మిఠాయిలు, ఆయిల్-సీడ్ ఎక్స్పెల్లర్లు, గోధుమపిండి వంటి తయారీ కేంద్రాలు మూతపడినట్టు సమాచారం.
డేరా దినపత్రిక కార్యాలయం, రిసార్టు, షాపింగ్ మాల్, సినిమా, పెట్రోల్ పంప్, రెస్టారెంట్, హోటళ్లు కూడా మూతపడ్డట్టు తెలుస్తోంది. ఆఖరికి డేరా ఆశ్రమంలోని వీధులు సైతం నిర్మానుష్యంగా మారాయని ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించిన జాతీయ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
800మంది మాత్రమే
మునుపటి కళను పూర్తిగా కోల్పోయిన డేరాలో ప్రస్తుతం నామమాత్రపు కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కొంతమంది శిష్యగణం మాత్రమే ఆశ్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు 10వేల మందితో నిత్యం కళకళలాడిన డేరాలో ఇప్పుడు కేవలం 800మంది మాత్రమే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.
డేరా బాధ్యతలు చూసేవారు కరువు
ఇటీవల డేరా వ్యవస్థాపకుడు షా మస్తానా బలోచిస్తానీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 4వేల మంది హాజరైనట్టు తెలుస్తోంది. డేరా కార్యకలాపాలు, వాటి లోగుట్టు అంతా గుర్మీత్, అతని దత్త పుత్రిక చేతుల్లోనే ఉంటూ వచ్చింది.
ప్రస్తుతం వారిద్దరూ జైల్లో ఉండటంతో డేరా కార్యకలాపాలను నిర్వహించేవారు కరువయ్యారు. డేరా చైర్ పర్సన్ విపస్సన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటం, గుర్మీత్ కుమారుడు జస్మీత్ డేరా బాధ్యతలకు దూరంగా జరగడంతో పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నట్టు సమాచారం.
కష్టంగా నడుస్తున్న స్కూల్స్
ఇక డేరా ఆశ్రమం తరుపున అధికారిక వివరాలు తెలిపేవారు కూడా కరువయ్యారు. చివరకు డేరా ఆసుపత్రి, స్కూళ్లు కాలేజీలు కూడా అతి కష్టం మీద నడుస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో డేరా బాబా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 20ఏళ్ల జైలుశిక్ష విధించింది.