కోవాగ్జిన్ కు డబ్లూహెచ్వో అమోదం ఆలస్యం-స్పందించిన భారత్ బయోటెక్-ఇదే క్లారిటీ
హైదరాబాదీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ డబ్లూహెచ్వో ఆమోదం కోసం జరుగుతున్న ప్రయత్నాలు నానాటికీ ఆలస్యమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవాగ్జిన్ పంపేందుకు ఈ ఆమోదం తప్పనిసరిగా మారడంతో ఆ మేరకు భారత్ బయోటెక్ కు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై ఇవాళ భారత్ బయోటెక్ స్పందించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి కోవాగ్జిన్ కు ఆమోదం తీసుకోవడంలో ఆలస్యమవుతుందన్న వార్తల నేపథ్యంలో భారత్ బయోటెక్ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యవసర వాడకానికి తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అనుమతి తీసుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. మా ఇతర వ్యాక్సిన్ల కోసం గత ఆమోదాలతో బాధ్యతాయుతమైన తయారీదారుగా, నియంత్రణ ఆమోద ప్రక్రియ, దాని కాలక్రమాల గురించి ఊహించడం లేదా వ్యాఖ్యానించడం మాకు సరైనది కాదని తెలిపింది. మేము అత్యవసర వాడకానికి ఆమోదం పొందడానికి WHO తో కలిసి పని చేస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది.
వ్యాక్సిన్ ఆమోదం అనుమతుల వ్యవహారం మిలియన్ల మంది జీవితాలు, జీవనోపాధులపై ప్రభావం చూపుతున్నందున, ప్రజారోగ్య సంబంధిత సమస్యలు, వ్యాక్సిన్ ఆలస్యంపై వార్తలు ఇచ్చేముందు మీడియా సంస్ధలు కూడా సంయమనం పాటించాలని భారత్ బయోటెక్ తన ప్రకటనలో పేర్కొంది.తగిన సమయాల్లో, రెగ్యులేటరీ ఆమోదాలను తెలియజేసేందుకు తాము ప్రకటనలు చేస్తామని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్యసంస్ధ ఆమోదం ఆలస్యమవుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ పై ఒత్తిడి పెరుగుతోంది అదే సమయంలో మీడియాలో ప్రతికూల కథనాలు రావడంతో భారత్ బయోటెక్ దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది.
భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా రోగులపై 78 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ నిర్ధారించింది. అయితే భారత్ లో నెలకొన్న కరోనా తీవ్రత నేపథ్యంలో కేంద్రం మాత్రం ఇక్కడ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గడంతో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మాత్రం దీని ఆమోదానికి తొందరపడటం లేదు. దీంతో భారత్ బయోటెక్ పైనా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది,