అనూహ్య ఘటన.. ఆటో ఎక్కి హైడ్రామా... పోలీసులకే గన్ ఎక్కుపెట్టి...
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూలై 29) పట్టపగలు ఓ హైడ్రామా చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన ఓ యువకుడు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి డ్రైవర్ను బెదిరించి రూ.85 దోచుకున్నాడు. తాను ఎక్కడైతే ఆటో ఎక్కానో తిరిగి అక్కడే దింపాలని బెదిరించాడు. ఆటో అక్కడికి చేరుకునేసరికి... అక్కడే పోలీసులు ఉండటంతో డ్రైవర్ వాళ్లను అప్రమత్తం చేశాడు. దీంతో సదరు యువకుడు పోలీసుల పైకి కూడా గన్ ఎక్కుపెట్టాడు. అయితే ఓ పోలీస్ అధికారి చాకచక్యంగా అతన్ని పట్టుకోవడంతో డ్రామాకు తెరపడింది.
వివరాల్లోకి వెళ్తే... దమన్ అరోరా అనే ఓ యువకుడు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం సౌత్ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ బస్ స్టాప్ నుంచి డిఫెన్స్ కాలనీకి వెళ్లేందుకు అతను ఆటో ఎక్కాడు. ఆ కొద్దిపాటి జర్నీలోనే అతను తన వద్దనున్న గన్ తీసి డ్రైవర్ తలకు ఎక్కుపెట్టాడు. డ్రైవర్ వద్దనున్న రూ.85 తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు.
తిరిగి తనను ఆండ్రూస్ గంజ్ బస్టాప్ వద్దే దింపాలని డ్రైవర్ను బెదిరించాడు. దీంతోడ్రైవర్ ఆటోని వెనక్కి తిప్పి అక్కడికే తీసుకొచ్చాడు. అదే సమయానికి అక్కడ కొంతమంది పోలీసులు విధుల్లో ఉండగా... ఆటో డ్రైవర్ వాళ్లను అప్రమత్తం చేశాడు. దీంతో పోలీసులు దమన్ అరోరాను పట్టుకునేందుకు రాగా... గన్ తీసి వాళ్ల వైపు గురిపెట్టాడు. అయితే ఓ పోలీస్ అధికారి చాకచక్యంగా వ్యవహరించి.. వెనుక నుంచి వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. దీంతో డ్రామాకు తెరపడింది.
తమను చూసి బెదిరిపోయిన దమన్ అరోరా... తనను తాను కాల్చుకుంటానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.85తో పాటు గన్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దమన్ అరోరా ఆ గన్ను జామియా నగర్కి చెందిన తాహిర్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.