హి ఈజ్ ఇన్ క్యూ.. ప్లీజ్ వెయిట్! రూ.4 వేల కోట్లకు మరో బడాబాబు శఠగోపం!?
లక్నో: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, విక్రమ్ కొఠారీ తదితరుల బాటలో కాన్పూర్కు చెందిన మరో బడాబాబు ఎంపీ అగర్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన రూ.3,972 కోట్ల మేర 16 బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు పొంది ఎగవేసినట్లు సమాచారం.
ఎంపీ అగర్వాల్ నేతృత్వంలోని శ్రీ లక్ష్మి కోట్సిన్ లిమిటెడ్కు సెంట్రల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం ఈ రుణాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మి కోట్సిన్ లిమిటెడ్కు అగర్వాల్ చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. టెక్స్టైల్స్తోపాటు ఆటోమొబైల్స్ కూడా ఈ కంపెనీ తయారు చేస్తోంది.
ఈ కంపెనీ నుంచి రుణాలను రాబట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే అగర్వాల్ ఆస్తులను వేలం వేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆస్తుల విలువ రూ.1,495 కోట్లు అని తేల్చారు.
రూ.3,972 కోట్లు రాబట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంకు డెట్ రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. సిక్ యూనిట్గా పరిగణించి, రాజీ కుదిర్చేందుకు 2016 నవంబరు 30న ఈ కేసును నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు బదిలీ చేశారు.