మోడీకి ఊరట: అసోంలో బీజేపీ ముందంజ, ములాయంకు గుడి కడ్తామని అజంఖాన్
గౌహతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న భారతీయ జనతా పార్టీకి అసోం మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప ఊరట లభించింది. అసోంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 743 వార్డులకుగాను సుమారు సగం స్థానాల్లో ప్రస్తుతం విజయం సాధించింది.
2016లో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరిగిన ఈ మున్పిసల్ ఎన్నికలను సెమీఫైనల్స్గా అభివర్ణించారు. 20 టౌన్ కమిటీలు, 23 మున్సిపల్ బోర్డులు నిన్నటి వరకు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ శాతం బీజేపీ గెలుచుకుంది.
2009లో కాంగ్రెస్ 496, బీజేపీ 92 కౌన్సిలర్లను గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీ సుమారు 340, సుమారు కాంగ్రెస్ 280 స్థానాలు గెలుచుకుంటున్నాయి. అసోం గణపరిషత్, ఏఐయూడీఎఫ్, ఎన్సీపీ, బీపీఎఫ్, సీపీఎంలు తక్కువ స్థానాలనే గెలుచుకున్నాయి. అసోం మున్సిపల్ ఎన్నికల్లో మంచి తీరు కనబరిచినందుకు ఆ రాష్ట్ర బీజేపీ శాఖను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
గుడిపై మోడీ అసంతృప్తి.. ముసుగేశారు
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్లో ప్రధాని మోడీకి గుడి కట్టిన విషయం తెలిసిందే. దీనిపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. గుడిని నిర్మించిన బృందం స్పందించింది. ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తే చేసిన నేపథ్యంలో ఆ గుడిలో భరతమాత విగ్రహాన్ని పెడతామని చెప్పారు.
మా దేవుడు (మోడీ) నమ్మకాలను దెబ్బతీసినందుకు తాము బాధపడుతున్నామని, ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలియగానే విగ్రహానికి ముసుగు వేశామని గుడిని నిర్మించిన వారిలో ఒకరైన రమేశ్ ఉందద్ అన్నారు. కాగా, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు గుడి కడతామని యూపీ మంత్రి అజమ్ ఖాన్ అన్నారు.