జైలుకైనా వెళ్తా, జరిమానా కట్టను: శ్రీశ్రీ రవి శంకర్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమునా తీరంలో ఆర్ట్ ఆప్ లివింగ్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన సభ వివాదాస్పదంగా మారింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 35వ వార్షిక వేడుకలను నిర్వహించాలని శ్రీశ్రీ శంకర్ సిద్ధమయ్యారు. అయితే యమునా తీరంలో నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.
ఈ వేడుక నేపథ్యంలో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి మంజూరు చేసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంపై పర్యావరణ పరిహారంగా రూ.5 కోట్లు చెల్లించాలని జరిమానా విధించింది.
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పైన రూ.5 లక్షలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పైన రూ.1 లక్, చొప్పున కూడా జరిమానా విధించింది. శుక్రవారం కార్యక్రమం మొదలవుతున్నందున... గురువారం సాయంత్రం నాలుగు గంటలలోగా రూ.5 కోట్లు పరిహారం జమ చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ను ఆదేశించింది.
అంతకుముందు, ఢిల్లీ - నోయిడాల మధ్య వేయి ఎకరాలకు పైగా సున్నితమైన ప్రాంతం మొత్తాన్ని ఒక్క గ్డి పరక లేకుండా చదును చేశారని, వేడుక నిలిపివేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆనంద్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది.
ఈ అంశం హైకోర్టుకు కూడా వెళ్లింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణ కోణంలో విపత్తులా కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. నదీ తీరంలో అక్రమ కట్టడాలపై వ్యాజ్యం కేసులో ఈ కార్యక్రమం ఏర్పాట్ల గురించి ప్రస్తావించింది.
జైలుకైనా వెళ్తా, పరిహారం చెల్లించను: శ్రీశ్రీ రవిశంకర్
పరిహారంపై శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ... జైలుకైనా వెళ్తా కానీ జరిమానా మాత్రం కట్టనని స్పష్టం చేశారు. తామేమీ తప్పు చేయలేదని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాము కానీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా లేమన్నారు. కాగా, రేపు సంస్కృతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.