అప్పుడు 'Sachine': ఇప్పుడు 'మిస్టర్ అంజలి'
కోల్కతా: నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో బుధవారం తన 199వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ఘనంగా సత్కరించేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అనేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏర్పాట్లలో కొన్ని పొరపాట్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో సచిన్ పేరును తప్పుగా రాసి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగ్రహానికి గురైన క్యాబ్ ఇప్పుడు మరో తప్పు చేసింది.
బుధవారం భారత్-వెస్డిండీస్ జట్ల మధ్య ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్కోర్ బోర్డుపై సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్ను తప్పుగా సంబోధిస్తూ ప్రదర్శించింది. ఆమెను మిస్టర్ అంజలి టెండూల్కర్ అని సంబోధించి వివాదంలో చిక్కుకుంది. ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డుపై వెల్కమ్ టూ మిస్టర్ అంజలి టెండూల్కర్ అని ఫ్లాష్ రావడంతో ప్రేక్షకులతోపాటు ఆటగాళ్లు ఖంగుతిన్నారు.
టెస్ట్ తొలి రోజు ఆట ప్రారంభం కావడానికి ముందు సచిన్ భార్య అంజలితోపాటు కుమారుడు అర్జున్ స్టేడియంలోకి రావడంతో వారిని ఆహ్వానించే సమయంలో ఈ తప్పుదొర్లింది. అయితే తప్పు గుర్తించిన సిబ్బంది వెంటనే సరిచేశారు. అయితే అప్పటికే అందరూ ఆ తప్పును గుర్తించడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మరిన్ని విమర్శలను మూటగట్టుకుంది.
కాగా అంతకుముందు బెంగాల్ క్రికెట్ అధికారులు సచిన్ టెండూల్కర్ పేరుకు బదులు Sachine టెండూల్కర్ అని మాస్టర్ పేరును స్టేడియంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్పై తప్పుగా రాశారు. దీనిపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బోర్డును చూపిస్తూ మాస్టర్ పేరును తప్పుగా రాసిన అధికారులెవరో చెప్పాలని ధోనీ మండిపడ్డాడు. అయితే సచిన్ పేరు తప్పుగా రాయడంలో తమ తప్పు లేదని అది ఓ ప్రైవేటు ఏజెన్సీ చేసిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు.