పాకిస్తాన్కు కౌంటర్: ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేసిన భారత్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ అనేక విషయాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివేయడం, థార్ ఎక్స్ప్రెస్ను నిలిపివేయడం, లాహోర్-ఢిల్లీ బస్సులను రద్దు చేయడంలాంటి నిర్ణయాలు తీసుకుంది. భారత్ కూడా ఇందుకు గట్టి సమాధానం చెబుతూ ఇప్పటికే సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేయగా.. తాజాగా ఢిల్లీ - లాహోర్ బస్సును రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రకటించింది.
సోమవారం నుంచి లాహోర్ - ఢిల్లీ బస్సును రద్దు చేస్తున్నట్లు సీనియర్ పాకిస్తాన్ మంత్రి శనివారం ఓ ప్రకటన చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన బస్సు వెళ్లలేదు. పాకిస్తాన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్ కూడా ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేశారు. ఆగష్టు 12 నుంచి ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక లాహోర్ - ఢిల్లీ బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు పాక్ అధికారులు ఢిల్లీ అధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు.
ఇదిలా ఉంటే లాహోర్కు చివరి బస్సు ఢిల్లీ నుంచి శనివారం ఉదయం బయలు దేరింది. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే అందులో ప్రయాణించారు. మరోవైపు లాహోర్ నుంచి ఢిల్లీకి వచ్చిన అదే బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆదివారం రోజు బస్సులు తిరగలేదు. 1999లో అప్పటి ప్రధాని వాజ్పేయి చేతులు మీదుగా బస్సు సర్వీసు ఢిల్లీ నుంచి లాహోర్కు ప్రారంభమైంది. అయితే 2001లో భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగిన తర్వాత బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగింది. అనంతరం 2003 జూలైలో బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది.
పుల్వామా దాడుల తర్వాత కూడా రెండు దేశాల మధ్య బస్సు సర్వీసులు నడిచాయి. లాహోర్ - ఢిల్లీ బస్ సర్వీసును ఢిల్లీ గేటు వద్ద అంబేడ్కర్ స్టేడియం టర్మినల్ నుంచి ప్రారంభం అవుతుంది.ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు సంబంధించిన బస్సులు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో నడుస్తాయి. అదే పాకిస్తాన్ బస్సులు ప్రతి మంగళవారం, గురువారం, మరియు శనివారాల్లో సర్వీసులు నడుపుతాయి.