మనుషులకు జంతువులకు అదే తేడా, నేనేంటో చూపిస్తా: పన్నీర్ సెల్వం
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్ శశికళ తన మీద చేస్తున్న ఆరోపణలపై తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తీవ్రస్థాయిలో స్పందించారు. మనుషులు, జంతువుల మధ్య తేడా ఉందని అన్నారు. ఆ తేడా ఏంటంటే మనుషులు చిరునవ్వు చిందిస్తారని, అదేం పెద్ద నేరం కాదని తన మీద ఆరోపణలు చేసిన వారికి చురకలు అంటించారు.
తాను నోరు విప్పింది కొంతే, మాట్లాడేదే ఇంకా చాల ఉంది, అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని, నన్ను నన్నుగా ఉండనీయండి అంటూ పన్నీర్ సెల్వం అవతలి పక్షాన్ని ఘాటుగా హెచ్చరించారు. శశికళ పన్నీర్ సెల్వం మీద ఆరోపణలు చేసిన తరువాత ఆయన ఈ విధంగా స్పందించారు.
పన్నీర్ సెల్వం బహిష్కరణ: పార్టీ పదవి నుంచి ఔట్, సంబరాలు
తానేంటో కొన్ని గంటల్లో చూపిస్తానని శశికళకు పరోక్షంగా సవాలు విసిరారు. నిన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, అసలు నోరు విప్పని పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి నుంచి శశికళ, ఆమె అనుచరులు, మన్నార్ గుడి గ్యాంగ్ మీద విరుచుకుపడుతున్నారు.
బుధవారం ఉదయం పన్నీర్ సెల్వం చెన్నైలోని ఆయన ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడుతూ శశికళ తన మీద చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తాను తమిళనాడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఓ సీఎంగా ప్రయత్నించానని అన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు అని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
తమిళనాడు పరిస్థితిని శశికళ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, అంత అర్జెంటుగా ఆమె సీఎం అయిపోయి ఎం చెయ్యాలని అనుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నించారు. అన్నాడీఎంకే పార్టీకి, అమ్మకు నిజమైన విశ్వాసపాత్రుడు నేనే అంటూ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు: నేనే సీఎం, శశికళ
ఇదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ షీలా బాలకృష్ణన్ రాజీనామా గురించి ఇప్పుడేమి చెప్పలేనని, ఆమెకు ఇప్పటికే ఎక్స్ టెన్షన్ ఇచ్చామని పన్నీర్ సెల్వం చెప్పారు. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక ఓ శక్తి ఉందని పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొన్ని గంటల్లో తానేంటో చూపిస్తానని పన్నీర్ సెల్వం సవాలు చెయ్యడంతో శశికళ వర్గీయులు హడలిపోయారు. పన్నీర్ సెల్వం వెనుక ఉన్న ఆ శక్తి ఏమిటి ? అని కూపీలాగుతున్నారు. అయితే పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాలు తారాస్థాయికి చేరారు.