శివసేన తర్వాత దక్షిణాదిన ఈ పార్టీతోనే బీజేపీ పొత్తు...సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయా..?
ఢిల్లీ: ఇన్ని రోజులు ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు... బీజేపీతో కలిసి వెళ్లేది లేదన్నారు... 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదన్నారు. నాయకుల మాటలను చూసి నిజమే అని అంతా భావించారు.. కానీ ట్విస్ట్ ఇస్తూ ఏ పార్టీని అయితే తిట్టిపోసిందో, విమర్శలు గుప్పించిందో చివరికి ఆపార్టీకే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. ఈ పాటికే ఆ పార్టీ ఏమిటో అర్థమై ఉండాలి. అవును.. ఆ పార్టీ శివసేన. ఇన్ని రోజులు బీజేపీపై విమర్శలు సంధించి ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తామని పలువేదికలపై చెప్పిన శివసేన చివరికి కాషాయం పార్టీతో చేతులు కలిపింది. ఇదిలా ఉంటే కమలం పార్టీతో మరో పార్టీ కూడా కలిసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ పార్టీ ఏమిటో తెలుసా..?
అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు
సోమవారం రోజున బీజేపీ శివసేన పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే దక్షిణాదిన కూడా బీజేపీతో మరో పార్టీ జట్టుకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం చెన్నైకి వెళ్లి అన్నాడీఎంకే అధినేతలను కలవనున్నారు. ఈ సందర్భంగా పొత్తుపై చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గతవారం జరిగిన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పీయూష్ గోయల్ చెన్నై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తమిళనాడులోని తిర్పూర్, కన్యాకుమారిలలో రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
బీజేపీ 15... అన్నాడీఎంకే 25 స్థానాల్లో పోటీ
40 లోక్సభ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేలు చెరో 20 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది కమలం పార్టీ. కానీ కొన్ని అడ్డంకులు తలెత్తడంతో మరో ఫార్ములా తెరపైకి వచ్చింది. బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు 15 సీట్లలో పోటీ చేసేలా, అన్నాడీఎంకే 25 స్థానాల్లో పోటీచేసేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 15 స్థానాల్లో బీజేపీ 8 మంది తమ అభ్యర్థులను బరిలో నిలుపుతుండగా.. మరో 7 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. అంటే విజయ్కాంత్ పార్టీ డీఎండీకే, అంబుమణి రాందాస్ పార్టీ పీఎంకే, ఇతర చిన్న పార్టీలకు కేటాయించింది.
రజనీకాంత్ కోసం చూసి నిరాశకు గురైన పార్టీలు
బీజేపీ అన్నాడీఎంకే పార్టీలు ఇద్దరు రజనీకాంత్ పెడతారనుకున్న పార్టీ కోసం వేచి చూసినట్లు కమలం పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే రజనీకాంత్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తర్వాత బీజేపీ అన్నాడీఎంకేల పొత్తు తెరపైకొచ్చింది. ఆగమేఘాలపై అంతర్గత చర్చలు జరిగాయి. ఇప్పటికే అధికారిక అన్నాడీఎంకేపై వ్యతిరేకత వస్తున్నందున బీజేపీతో కలిసి పోటీ చేస్తే బలమైన శక్తిగా అవతరిస్తామని అన్నాడీఎంకే భావిస్తోంది. అంతేకాదు తమిళనాడు రాష్ట్రానికి మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందువల్ల ప్రజలు హర్షిస్తున్నారని ఇది తమకు కలిసొస్తుందని పళనిస్వామి సర్కార్ భావిస్తోంది.
గతవారమే బీజేపీ అన్నాడీఎంకేల మధ్య చర్చలు
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గత వారం అర్థరాత్రి వరకు పళనీ స్వామి, పన్నీర్ సెల్వంతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని బీజేపీ అంతర్గత సమాచారం. అంతేకాదు పీఎంకే పార్టీని పొత్తులో భాగంగా ఉండేలా బాధ్యత తీసుకోవాలని బీజేపీకి అన్నాడీఎంకే సూచించినట్లు సమాచారం. అంతేకాదు పీఎంకే, డీఎండీకేలకు చెరో మూడు స్థానాలు కేటాయించాల్సిందిగా కూడా ఈ సమావేశంలో చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఇక అన్నాడీఎంకే మోడీ పాపులారిటీపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే కోయంబత్తూర్, కన్యాకుమారి, శివగంగా, తిర్పూర్లలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో కమలం పార్టీ అగ్రనాయకులైన అమిత్ షా, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీలు రాష్ట్రంలో ఇప్పటికే పర్యటించి క్యాడర్లో జోష్ను నింపారు.
ఎన్నికల తర్వాత అవసరమైతే టీఆర్ఎస్, వైసీపీల మద్దతు
ఇక దక్షిణాదిన పాగా వేద్దామనుకున్న బీజేపీ కల నెరవేరడం లేదు. ఒక్క కర్నాటకలో తప్పనిస్తే మిగతా ఏరాష్ట్రంలో కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కొన్ని పార్టీల మద్దతు అవసరమనే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణల నుంచి ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, వైసీపీల మద్దతును కోరే అవకాశమున్నట్లు బీజేపీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మార్చి మొదటి వారాంతానికి పొత్తులపై ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల తర్వాత ఉత్తర్ ప్రదేశ్పై కన్నేశారు కమలనాథులు.