ఆరేళ్ల క్రితం కనిపించకుండాపోయిన భర్త... అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..
చెన్నై : అక్రమ సంబంధాల మోజులో జనం ఎంతకైనా తెగిస్తున్నారు. వావి వరసలు మరిచి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. కుటుంబం కోసం వేల మైళ్ల దూరం వెళ్లిన వ్యక్తిని వంచించిన అతని భార్య సొంత మరిదితోనే సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి హెచ్చరించిన భర్తను అతని సొంత తమ్ముడితో కలిసి కడతేర్చింది. గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని పూడ్చిపెట్టి నాటకాలు ఆడింది. చివరకు పాపం పండటంతో ఆరేళ్ల తర్వాత మర్డర్ మిస్టరీ వీడింది.
ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన భర్త
తమిళనాడులోని కడలూరు హార్బర్ సింగారతోపు గ్రామానికి చెందిన మురుగదాసన్, భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉండేవాడు. కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలన్న తలంపుతో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. 2013 జనవరి 6న బావమరిది పెళ్లి ఉండటంతో సింగారతోపునకు వచ్చాడు. అయితే కొన్ని రోజులకే అతను కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులుదర్యాప్తు చేపట్టారు. అతని పాస్పోర్టు ఇంట్లోనే లభించడంతో అతను తిరిగి సౌదీ వెళ్లలేదన్న నిర్థారణకు వచ్చారు.
కోడలి ఆచూకీ దొరకకపోవడంతో
మురుగదాస్ కనిపించకుండా పోయిన కొన్ని రోజులకే కోడలు మకాం మార్చేసింది. మరికొన్నాళ్లకు మురుగదాస్ చిన్న తమ్ముడు సుమయుర్ కూడా పత్తా లేకుండా పోయాడు. కోడలు, కొడుకు కనిపించకుండా పోవడంతో అతని తల్లి పవనమ్మాళ్కు అనుమానం కలిగింది. కోడలు ఆచూకీ కోసం విఫల ప్రయత్నాలు చేసింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది.
విచారణలో బయటపడ్డ వాస్తవం
పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. మురుగదాసన్ దుబాయ్లో ఉన్న సమయంతో అతని తమ్ముడు తరుచూ సింగారతోపులో ఉంటున్న వదిన వద్దకు వచ్చేవాడు. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి మురగదాసన్ పద్దతి మార్చుకోమని ఇద్దరినీ హెచ్చరించడంతో అతని హత్యకు కుట్రపన్నారు. ప్లాన్ ప్రకారం అతన్ని మర్డర్ చేసి ఇంట్లోనే పాతిపెట్టారు. అనంతరం భర్త కనిపించడంలేదంటూ సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరిదితో కలిసి కేరళకు వెళ్లిపోయింది. ఆరేళ్ల తర్వాత కేసు విచారణ పూర్తి చేసిన పోలీసులు కేరళలో సహజీవనం చేస్తున్న సునితతో పాటు సుమయర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పాతిపెట్టిన మురుగదాసన్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు.