రాహుల్తో నో, ప్రియాంకతో ఓకే : తమ మధ్య విభేదాలు లేవన్న తేజస్వి, కలిసి ప్రచారం చేస్తామని వెల్లడి
పాట్నా : ఎన్డీఏను గద్దె దింపేందుకు జట్టు కట్టిన మహాకూటమి నేతల ఎడమొహం, పెడమొహం కూటమిలో చీలిక వచ్చిందా అనే అనుమానాలకు రేకెత్తించింది. బీహార్లో ఆర్జేడీ నేత, మహాకూటమి అధికార ప్రతినిధి తేజస్వి యాదవ్ .. కాంగ్రెస్ చీఫ్ రాహుల్తో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. రాష్ట్రంలో రాహుల్ నిర్వహించిన మూడు రోడ్ షోలకు దూరంగా ఉన్నారు.
ఏం జరుగుతోంది ?
రాష్ట్రంలో మోదీ నిర్వహించిన ర్యాలీలో బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీ మహాకూటమిపై విమర్శలు చేసింది. కూటమిలో ఏం జరుగుతుందోనని, బీహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ ప్రశ్నించారు. రాహుల్ సభలకు తేజస్వి డుమ్మా వెనుక కారణాలేంటని ప్రశ్నించారు.
ఇక పాల్గొంటా ..
విపక్షాలు ప్రశ్నించడంతో తమ కూటమి అస్థిత్వం ప్రమాదంలో పడిందనే సంకేతాలు ఎక్కడ జనాలకు వెళ్తుందోనని ఆర్జేడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 విడుతలు జరుగుతుండగా ... బీహార్లో మొత్తం 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 విడతలకు ప్రచారం ముగిసినందున .. మరో 4 విడతల్లో రాహుల్, ఆయన సోదరి ప్రియాంకతో కలిసి ప్రచారం నిర్వహిస్తానని తేజస్వి యాదవ్ స్వయంగా ప్రకటించారు.
అవును .. క్లారిఫై చేసిన కాంగ్రెస్
తేజస్వి ప్రకటనను కాంగ్రెస్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వచ్చే 4 విడతల్లో ప్రియాంక గాంధీతో తేజస్వి స్టేజీ పంచుకుంటారని పేర్కొన్నాయి. ఇదివరకు రాహుల్, తేజస్వి యాదవ్ .. బీహార్, జార్ఖండ్ సీట్ల పొత్తుపై చర్చలు కూడా జరిపారని పేర్కొన్నారు. రాహుల్తో అభిప్రాయ బేధాలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు తేజస్వి యాదవ్ను ప్రశ్నిస్తే ,, అదేం లోదని తోసిపుచ్చారు.
సుపౌల్ మాత్రం నో
రాష్ట్రంలో మహాకూటమి పోటీచేనే అన్ని స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తానని తేజస్వి స్పష్టంచేశారు. కానీ సుపౌల్ నుంచి మాత్రం తాను ప్రచారం నిర్వహించబోనని తేల్చిచెప్పారు. ఇక్కడ కూటమి అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తే మధేపురలో శరద్ యాదవ్ విజయవకాశాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయితే రాహుల్ తో చర్చల సందర్భంగా కాంగ్రెస్ కు కేవలం 9 సీట్లే కేటాయిస్తామని తేజస్వి యాదవ్ అనడంతో వివాదానికి కారణమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.