పరిమళించిన మానవత్వం- తండ్రి శవాన్ని నిరాకరించిన కొడుకు- అంత్యక్రియలు జరిపిన ముస్లింలు...
ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మానవత్వాన్ని ఏ స్ధాయిలో కాలరాస్తోందో నిత్యం కథలు కథలుగా చదువుతూనే ఉన్నాం. కానీ అలాంటి ఓ ఘటనలో కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు యువకులు కరోనా అనుమానంతో చనిపోయిన ఓ వృద్ధుడికి అంతా తామై అంత్యక్రియలు నిర్వహించిన అరుదైన సందర్భం కనిపించింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కులమతాలకు అతీతంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
షాకింగ్ : కరోనా నంబర్స్పై సీసీఎంబీ సంచలనం.. అసలు లెక్క 10 రెట్లు ఎక్కువ..
కరోనాతో తల్లి- తండ్రికి గుండెపోటు...
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ వృద్ధ దంపతుల కుటుంబం నివసిస్తోంది. వాళ్ల కుమారుడు నాగపూర్ లో ఉంటున్నాడు. తాజాగా ఈ దంపతుల్లో భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెను అకోలా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అదే సమయంలో 78 ఏళ్ల వయసున్న ఆమె భర్తకు గుండె పోటు వచ్చింది. రెండు రోజుల క్రితం సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ విషయం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్న వృద్ధురాలికి తెలిసింది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ పంపారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు.
తండ్రి శవం తీసుకెళ్లని కొడుకు...
తల్లి ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటోంది. తండ్రి గుండెపోటుతో చనిపోయారన్న వార్త తెలిసింది. నాగపూర్ లోని కొడుకు లాక్ డౌన్ లోనూ ప్రభుత్వ అనుమతి తీసుకుని అకోలాకు వస్తాడని అంతా భావించారు. కానీ ఆ కొడుకు అలా చేయలేదు. తండ్రికి కూడా కరోనా సోకి ఉంటుందనే భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆస్పత్రి సిబ్బంది గందరగోళంలో పడ్డారు.
అంత్యక్రియలకు ముందుకొచ్చిన ముస్లింలు...
అకోలా కుచ్చి మెమన్ జమాత్ పేరుతో పనిచేస్తున్న ఓ ముస్లిం స్వచ్ఛంద సంస్ధకు చెందిన కొందరు యువకులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారు తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని ముందుకొచ్చారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఇప్పటికే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో 21 మంది కోవిడ్ 19 మృతులతో పాటు మొత్తం 60 మందికి అంత్యక్రియలు నిర్వహించిన చరిత్ర వీరిది. దీంతో మరోసారి మానవత్వం చాటుకోవాలని భావించిన వీరు వృద్ధుడి మృతదేహాన్ని హిందు స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడే హిందూ ధర్మం ప్రకారం అన్ని లాంఛనాలు పూర్తి చేసి చితికి నిప్పంటించారు.
శాంపిల్స్ తీయలేదన్న అధికారులు...
భార్య కరోనాతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుండగా గుండెపోటుతో మరణించిన వృద్ధుడి శాంపిల్స్ సేకరించిన కరోనా టెస్టులకు పంపేందుకు ప్రస్తుతం వీలు లేదు. ఐసీఎంఆర్ తాజాగా తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారం చనిపోయిన వారి మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించి స్వాబ్ టెస్టులు నిర్వహించే వీలు లేదు. దీంతో డాక్టర్లు శాంపిల్స్ తీసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇంతకీ ఆ వృద్ధుడికి కరోనా ఉందో లేదో కూడా తేలకుండానే మృతదేహాన్ని స్వీకరించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాని కుమారుడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో తమకెలాంటి సంబంధం లేకపోయినా, మతం వేరైనా అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం సంస్ధపై మహారాష్ట్రలో ప్రశంసల జల్లు కురుస్తోంది.