శ్రీదేవి జీవితం మహోన్నతం, ఆమె కలల సాకారం కోసం.: కపూర్ ఫ్యామిలీ ఉద్వేగపూరిత లేఖ
ముంబై/న్యూఢిల్లీ: భారత సినీ దిగ్గజ నటి శ్రీదేవి అంత్యక్రియల బుధవారం ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో వేలాదిమంది అభిమానుల సమక్షంలో పూర్తయ్యాయి. అంత్యక్రియల అనంతరం శ్రీదేవి కపూర్ కుటుంబం ఈ మేరకు అభిమానులకు ఓ ఉద్వేగభరితమైన లేఖను రాసింది.
శనివారం రాత్రి దుబాయిలోని ఓ హోటల్ బాత్రూం వాటర్ టబ్లో ప్రమాదవశాత్తు పడి శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడి పోలీసుల విచారణ అనంతరం మంగళవారం రాత్రి ఆమె పార్థీవ దేహాన్ని ముంబైకి తీసుకువచ్చారు. బుధవారం ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ఆమె పార్థీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
తీరని వేదన
ఆ లేఖలో శ్రీదేవి మృతి తమను తీరని వేదనకు గురిచేసిందని తెలిపింది. గత కొద్ది రోజులుగా తాము ఆమె మృతి చెందిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వెల్లడించింది. అంత్యక్రియలు జరిగిన బుధవారం తమను మరెంతో వేదనకు గురిచేసిందని వెల్లడించింది. ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుకుంటున్నామని పేర్కొంది.
చిరంజీవిపై కత్తి మహేష్ అసందర్భ ట్వీట్: నెటిజన్లు విమర్శలు
ఆమె జీవిత పయనం అద్భుతం
శ్రీదేవి ఒక మహోన్నతమైన, అద్భుతమైన జీవితాన్ని, తనకే సాధ్యమైన రీతిలో జీవించారని కపూర్ ఫ్యామిలీ తెలిపింది. ఆమె ప్రతిభకు కొలమానం లేదు.. ఆమె అందం వర్ణనాతీతం.. ఆమెకు అభిమానులతో ఉన్న సంబంధం విడదీయరానిదని వెల్లడించింది. ఆమె తన కుటుంబంతో కూడా ఇలాంటి బంధాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు శ్రీదేవి మరిది, బోనీ కపూర్ సోదరుడు అనిల్ కపూర్, పిల్లలు సోనమ్, రియా, హర్షవర్ధన్, ఇతర కుటుంబసభ్యుల పేరుమీద సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లను కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.
శ్రీదేవి కూతుళ్లపై అవే ప్రేమాభిమానాలు చూపుతారని..
‘శ్రీదేవి మరణం వార్తతో దేశంతోపాటు ప్రపంచంలోని ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివి. ఇవే ప్రేమాభిమానాలను శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషీలపై కూడా చూపుతారని ఆశిస్తున్నాం. ఎంతో మంది అభిమానుల ప్రేమాభిమానాలను పొందిన శ్రీదేవి.. వారి గుండెల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు.' అని లేఖలో పేర్కొన్నారు.
దుబాయ్ వెళ్లే ముందు శ్రీదేవికి జ్వరం, గొంతునొప్పి, అవే ఇష్టం: తమ స్నేహంపై పింకిరెడ్డి
శ్రీదేవి కల సాకారానికి.. మీడియాకు వినతి
‘శ్రీదేవి కలలు కన్న జీవితాలను ఆమె కూతుళ్లకు అందివ్వాల్సిన అవసరం ఉంది. శ్రీదేవి, ఆమె కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీడియా పరిమితికి లోబడి వ్యవహరిస్తుందని అనుకుంటున్నాం. శ్రీదేవి తన జీవితాన్ని ఎంతో గౌరవప్రదంగా కొనసాగించారు. ఆమెను గౌరవించుకోవాల్సిన అవసరం మనపై ఉంది.' అని ఆ లేఖలో పేర్కొన్నారు. కపూర్, అయ్యప్పన్, మార్వా ఫ్యామిలీ పేరు మీద విడుదల చేసిన ఈ లేఖను అనిల్ కపూర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.