మగ శిశువుకు జన్మనిచ్చిన 13ఏళ్ల బాలిక: అబార్షన్కు సుప్రీం అనుమతినివ్వడంతో!
అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక(13)కు ముంబై జేజే ఆసుపత్రి వైద్యులు గర్భ స్రావం చేశారు. 31వారాల గర్భాన్ని తొలగించడం తల్లి ప్రాణానికి కూడా ముప్పు అని వైద్యులు చెప్పినప్పటికీ..
ముంబై: అభం శుభం తెలియని వయసులో గర్భం దాల్చిన అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక(13)కు ముంబై జేజే ఆసుపత్రి వైద్యులు గర్భ స్రావం చేశారు. 31వారాల గర్భాన్ని తొలగించడం తల్లి ప్రాణానికి కూడా ముప్పు అని వైద్యులు చెప్పినప్పటికీ.. సుప్రీం కోర్టు మాత్రం అబార్షన్ చేయమని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కోర్టు ఆదేశాలతో శుక్రవారం బాలికకు ఆపరేషన్ నిర్వహించారు. బాలిక వయసు, అనారోగ్యం కారణంగా సాధారణ డెలివరీ సాధ్యపడలేదని, దీంతో సిజేరియన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. నెలలు నిండని కారణంగా 1.8కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం శిశువు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అలాగే బాలిక కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు.
గైనాలజీ విభాగం అధిపతి డా.అశోక్ ఆనంద్ ఈ వివరాలు వెల్లడించారు. బిడ్డను తీసుకెళ్తారా? లేదా? అన్నది బాలిక కుటుంబం ఇంకా నిర్దారించలేదని తెలుస్తోంది. కాగా, బాలిక మానసిక స్థితి, మెడికల్ బోర్డు నివేదికను పరిశీలించిన అనంతరం అత్యున్నత ధర్మాసనం అబార్షన్ కు అనుమతినిచ్చింది.
కాగా, ఏడు నెలల క్రితం బాలికపై ఆమె తండ్రి వ్యాపార భాగస్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనూహ్యంగా బరువు పెరగడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె 27వారాల గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. బాలికపై నిందితుడు పలుమార్లు అత్యాచారం జరిపినట్లు పోలీసులు నిర్దారించారు.