బీజేపీ అక్రమంగా గద్దెనెక్కింది..కర్ణాటక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కర్ణాటకకు చెందిన 17 మంది తిరుగుబాటు శాసన సభ్యులు ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ డిమాండ్ ను లేవనెత్తింది. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమలను చేపట్టిందనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పష్టమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర నాయకుడు రణ్ దీప్ సుర్జేవాలా, అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు.
కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్మేలు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఒకేసారి 17 మంది రాజీనామాలు చేయడంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడింది. అసెంబ్లీలో బల నిరూపణకు ముందే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్-జేడీఎస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటు లేవనెత్తి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మందిపై నాటి స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.
వారి రాజీనామాల వల్ల ఖాళీ అయిన 17 స్థానాల్లో 15 చోట్ల వచ్చే నెల 5వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బుధవారం ఆదేశాలను జారీ చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చని పేర్కంది. అనర్హత వేటు చెల్లనప్పడు.. వారి రాజీనామాలను కూడా పరిగణనలోకి తీసుకోవద్దని, తిరుగుబాటు ఎమ్మెల్యేలు సొంత పార్టీలో కొనసాగుతున్నట్టుగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ తాజాగా డిమాండ్ చేస్తోంది.
శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు రేపే
అలా జరిగితే- తమ కూటమికే శాసనసభలో మెజారిటీ లభిస్తుందని సూర్జేవాలా, మను సింఘ్వీ చెబుతున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ కుట్రలు చేసిందనే విషయం సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని వారు విమర్శించారు. ఆపరేషన్ కమలను చేపట్టిన బీజేపీ వందల కోట్ల రూపాయలను వెదజల్లి కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యను కొనుగోలు చేసిందని, బీజేపీ వలలో చిక్కుకుని వారు తమ పదవులకు రాజీనామాలు చేశారని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని వెంటన బర్తరప్ చేయాలని వారు డిమాండ్ చేశారు.