మోడీ చేతిలో కాంగ్రెస్ జుట్టు: కర్ణాటక ముడుపులు రూ. వెయ్యి కోట్లా ?
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం పెద్దలకు రూ. 1,000 కోట్లు ముడుపులు చెల్లించారని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను జైలుకు పంపించే వరకు తాను నిద్రపోనని చాలెంజ్ చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ముడుపులు పంపించిన డైరీలోని కొన్ని పేపర్లు గురువారం రాత్రి మీడియాకు విడుదల కావడంతో రాజకీయంగా పెను సంచలనాలకు దారితీసింది. ఇప్పుడు ఢిల్లీతో సహ కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలు యుద్దం కోనసాగుతోంది.
కర్ణాటక ప్రభుత్వం అధిష్టానానికి పంపినట్లుగా రాసిన డైరీలోని కొన్ని పేపర్లు మీడియాకు విడుదల అయ్యాయి. ఆ పేపర్లలో కేజేజే అండ్ ఎంబీపీ రూ. 32 కోట్లు, హెచ్ సీఎం రూ. 10 కోట్లు, డీకేఎస్ రూ. 3 కోట్లు, ఆర్ఎల్ ఆర్ రూ. 5 కోట్లు, ఆర్ వీడీ రూ. 3 కోట్లు, ఎస్ బీ రూ. 4 కోట్లు, కేఈఎంపీ రూ. 3 కోట్లు చెల్లించినట్లుగా నమోదు చేశారు.
అంతే కాకుండా కొన్ని పేజీల్లో ఏకంగా కేజేజే రూ. 219 కోట్లు, హెచ్ సీఎం రూ. 47 కోట్లు, ఎస్ బీ రూ. 23 కోట్లు, రూ. ఆదర్శ్ రూ. 16.75 కోట్లు ఇచ్చినట్లుగా నమోదు అయ్యింది. దీంతొపాటు మీడియాకు విడుదలైన పేపర్లలో నెలల వారి చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
దీంతో పాటు అధిష్టానంలో చెల్లించినట్లుగా ఉండే పేపర్లలో ఓరా రూ. 32 కోట్లు, డీజీఎస్ రూ. 6 కోట్లు, ఆర్ జీ ఆఫీస్ రూ. 8 కోట్లు, ఎస్ జీ రూ. 4 కోట్లుగా డైరీలో ఆధారాలు ఉన్నాయి. 2016 సెప్టెంబర్ నుంచి రూ. 2017 జనవరి వరకు నెలల వారిగా అధిష్టానానికి ముడుపులు ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి.
కర్ణాటకలో ముడుపులు ఇచ్చిన వారితో పాటు ఢిల్లీలోని అధిష్టానం పెద్దలు ఎవ్వరెవ్వరు ముడుపులు తీసుకున్నారో ఆ వివరాలు కోడ్ ల రూపంలో ఉండటం కోసమెరుపు. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ ఎమ్మోల్సీ, కర్ణాటక ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరాజులు నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేశారు.
ఐటీ దాడుల సమయంలో ఈ డైరీ బయటపడిందని సమాచారం. అయితే మీడియాలో వస్తున్న డైరీకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ గోవిందరాజులు అంటున్నారు. డైరీకి సంబంధించి ఏ విచారణకైనా తాను సిద్దం అని గోవిందరాజులు శుక్రవారం మీడియాకు చెప్పారు.