దేశంలోనే తొలిసారిగా.. లైంగిక నేరగాళ్ల వివరాలతో రిజిస్టర్: కేరళ గవర్నర్
ఇందుకోసం లైంగిక నేరాలకు పాల్పడేవారి గుర్తింపు వివరాలతో రిజిస్టర్ తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగికదాడి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా.. కేరళ ప్రభుత్వం సైతం విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు నిందితులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టవద్దని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేరళ గవర్నర్ పి సదాశివం నటి లైంగిక వేధింపుల ఘటనపై తాజాగా స్పందించారు. కేరళలో లైంగిక నేరాలకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం లైంగిక నేరాలకు పాల్పడేవారి గుర్తింపు వివరాలతో రిజిస్టర్ తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలోనే ఇలాంటి చర్యను తొలుత కేరళ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు వివరించారు. నేరగాళ్లను అదుపుచేయడంతో పాటు లైంగిక కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి ప్రభుత్వం తరుపున సహాయ నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
కేంద్రం ఆధీనంలో పనిచేస్తున్న నిర్భయ కేంద్రం పనితీరు బాగున్నప్పటికీ బాధితులకు సహాయం అందించడంలో మాత్రం ఇంతవరకు సమగ్ర నిధిని ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు. ఇక కొంతమంది బాధితులకు ఆర్థిక సహాయం అందుతున్నా..అందులోను జాప్యం జరుగుతూ వస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
లైంగిక నేరాలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం సమాజపరమైన నిరోధం లేకపోవడమేనని అన్నారు. తాలుకా స్థాయిలో పూర్తి స్థాయి మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముందుగా ప్రకటించిన తేదీకే ప్రతీ పంచాయితీకి పోలీసు అధికారిణిలు తప్పనిసరిగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.