ఇందుకోసమేనా : ఆ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లోని సున్నిత ప్రాంతమైన అనంతనాగ్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేపట్టింది. ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఇంటర్నెట్ను కూడా బంద్ చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం ఏడు గంటలకు అనంతనాగ్ పార్లమెంట్ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. భద్రతా కారణాల వల్ల రెండు గంటలు ముందే పోలింగ్ ముగియనుంది.
పోలింగ్ కేంద్రాలకు చేరుకోని ఓటర్లు
ఎన్నికల సంఘం అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఓటర్లు మాత్రం ఇంకా పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేదు. బిజ్బెహరా, ఫహల్గాం, షాంగస్ , అనంతనాగ్, కోకెర్నాగ్, డూరు సెగ్మెంట్లలో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపకపోవడం విశేషం. చాలా తక్కువ మంది ఓటర్లు అక్కడ కనిపించారు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదుల కదలికలు ఉండటంతో ఆ నియోజకవర్గానికి మొత్తం మూడుదశల్లో పోలింగ్ జరగనుంది.
భద్రతా దళాలకు సవాల్గా మారిన అనంతనాగ్ పోలింగ్
అనంతనాగ్లో అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టి ఓటర్లు సురక్షితంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని భావించినా ఓటర్లు ఓటు వేసేందుకు రాకపోవడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.ఇక పోలింగ్ సజావుగా సాగడం, ఉగ్రవాదుల కదలికలపై కన్ను,శాంతిభద్రతల అంశాలు భద్రతా బలగాలకు పెనుసవాల్గా మారాయి. రహదారులు, కొండ ప్రాంతాల్లో భద్రతాదళాలు గస్తీ కాస్తున్నాయి. ఇక ఈ నియోజకవర్గం నుంచి జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గులామ్ అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి జస్టిస్ (రిటైర్డ్) హస్నేన్ మసూదిలు పోటీ చేస్తుండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు జరగనుంది.
ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా ఓటర్లకు వేర్పాటు వాదుల పిలుపు
ఇదిలా ఉంటే ఎన్నికలను బహిష్కరించాలంటూ వేర్పాటు వాదులు ప్రజలకు పిలుపునిచ్చారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ జీహార్ కౌన్సిల్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో జమ్ముకశ్మీర్ ఉంది. అదే సమయంలో ఎన్నికలు జరుగుతుండటం విశేషం. జూన్ 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా ముఫ్తీ సర్కారు కూలిపోయింది.