ఉద్దవ్ థాక్రేకు రిలీఫ్.. మండలి ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరిన గవర్నర్..
ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు పదవీ గండం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి సంకట స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం(ఏప్రిల్ 30) ఫోన్ ద్వారా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ మండలి ఎన్నికలు నిర్వహించాలని గురువారం ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఈ మేరకు ఈసీకి ఆయన ఓ లేఖ రాశారు.
ఖాళీ అయిన 8 మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఉద్దవ్ థాక్రే ఈసీని కోరారు. అది కూడా రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు తావు లేకుండా కాస్త ముందుగానే ఎన్నికలు నిర్వహించాలన్నారు. లాక్ డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిందని.. అందులో మండలి ఎన్నికలకు కూడా మినహాయింపు ఉందని గుర్తుచేశారు.
కాగా,ప్రస్తుతం ఉభయ సభల్లో ఎందులోనూ ఉద్దవ్ సభ్యుడిగా లేరు. రాజ్యాంగం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే... పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరు నెలల్లోగా శాసనమండలి లేదా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది.లేని పక్షంలో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మే 28 వరకు ఆయనకు గడువు ఉంది.
నిజానికి గవర్నర్ కోటాలో ఉద్దవ్ను ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేస్తూ దాదాపు నెలన్నర క్రితమే శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్కు అందజేశారు. అయితే గవర్నర్ మాత్రం దీనిపై ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. దీంతో ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ఉద్దవ్.. ఆయన జోక్యాన్ని కోరారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కరోనా నేపథ్యంలో రాజకీయాలకు తావిస్తే రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.