యూపీ బాటలో మధ్యప్రదేశ్- లవ్ జిహాద్ వ్యతిరేక చట్టానికి కేబినెట్ ఆమోదం
దేశంలో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టాలు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తొలుత ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాన్ని అమల్లోకి తీసుకురాగా. ఇప్పుడు మరో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.
ఇవాళ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ నేతృత్వంలో సమావేశమైన మధ్యప్రదేశ్ కేబినెట్ లవ్ జిహాద్ వ్యతిరేక చట్టానికి ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ బిల్లు 2020 పేరుతో రూపొందించిన ఈ చట్టానికి ఆమోద ముద్ర వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే మైనర్లను కానీ యువతులను కానీ, ఎస్సీ, ఎస్టీ కులాల యువతులను కానీ మత మార్పిడి చేస్తే 2 నుంచి పదేళ్ల శిక్ష విధిస్తారు. దీంతో పాటు 50 వేల రూపాయల కనీస జరిమానా కూడా విధిస్తారు.
మరోవైపు సాధారణ మతమార్పిళ్లకూ శిక్షలు ఖరారు చేస్తూ ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. సాధారణంగా మతమార్పిళ్లకు పాల్పడితే ఏడాది నుంచి ఐదేళ్ల శిక్షలు విధిస్తారు. అలాగే కనీసం 25 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తారు. త్వరలో ఈ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం పొందితే 1968 నాటి మత స్వేచ్ఛ చట్టం రద్దవుతుంది. అలాగే తాజా చట్టం ప్రకారం మతమార్పిళ్లతో జరిగే వివాహాలు చెల్లవు. అలాగే ఈ చట్టం అమల్లోకి వస్తే పెళ్లి చేసుకుని కానీ మరే విధంగా కానీ మతమార్పిళ్లు జరిగే అవకాశం ఉండదు.