శకట రాజకీయం: నిన్న బెంగాల్..నేడు మహారాష్ట్ర: గణతంత్ర వేడుకల్లో మరాఠా శకటానికీ బ్రేక్..!
ముంబై: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగంచుకుంటోందా? ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలను ఉద్దేశపూరకంగానే అడ్డుపడుతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని ఇస్తున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సులే.
పశ్చిమ బెంగాల్ శకటానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చోటు కల్పించలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ శకటానికి సంబంధించిన ప్రతిపాదనలను తోసి పుచ్చింది. దేశ రాజధానిలో నిర్వహించబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పశ్చిమ బెంగాల్ శకటం కనిపించదు. తాజాగా- మహారాష్ట్ర శకట ప్రదర్శనకు కూడా కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించలేదని సుప్రియా సులే వెల్లడించారు. రాజకీయ కారణాలు, దురుద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాంస్కృతిక మూలాలపై దెబ్బకొడుతోందని మండిపడ్డారు.
ఈ మేరకు గురువారం ఆమె ఓ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రెండూ స్వాతంత్య్ర పోరాటంలో తమవంతు పాత్ర పోషించాయని, ఘన చరిత్ర ఉన్న మహారాష్ట్ర శకటాన్ని కేంద్రం ఏ కారణంతో నిరాకరించిందనే విషయాన్ని వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి అధికారాన్ని దూరమైందనే అక్కసును కేంద్రం ఈ రకంగా తీర్చుకుంటోందని విమర్శించారు. దేశం యావత్తూ పండగలా జరుపుకొనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రభుత్వం రాజకీయ వేదికగా మార్చిందని ఆరోపించారు.
प्रजासत्ताक दिनानिमित्तच्या संचलनात महाराष्ट्र व पश्चिम बंगालच्या चित्ररथास केंद्र सरकारने परवानगी नाकारली.हा देशाचा उत्सव असून केंद्र सरकारने सर्व राज्यांना प्रतिनिधित्व देणे अपेक्षित आहे.परंतु सरकार आकसाने वागत असून विरोधकांची सत्ता असणाऱ्या राज्यांना सापत्नभावाची वागणूक देतेय.
— Supriya Sule (@supriya_sule) January 2, 2020
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ రాజధానిలో ఆయా రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో తమ రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించడాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటూంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ సారి కూడా దీనికి సంబంధించిన మొత్తం 56 ప్రతిపాదనలు రక్షణ మంత్రిత్వ శాఖకు అందాయి.