కళ్మీర్లో ఏకమైన రాజకీయ పార్టీలు- ఏడాది గ్యాప్ తర్వాత బయటికి- ప్రత్యేక హోదా పోరు
దశాబ్దాల తర్వాత జమ్మూ-కశ్మీర్లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయి. గతేడాది కేంద్రం తమ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా తొలగించడంపై రగిలిపోతున్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా అవమానంతో రగిలిపోతున్నాయి. దశాబ్దాలుగా తమ రాష్ట్రంలో అత్యున్నత అధికారం అనుభవించిన తమను గృహనిర్భంధాల్లో ఉంచడంపై మండిపడుతున్న ఆయా పార్టీల నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలు ఉమ్మడి పోరుకు కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు.
అవమానంతో రగిలిపోతున్న దిగ్గజాలు..
కశ్మీర్లో దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవించి గతేడాది కేంద్రం తీసుకున్న ఒక్క నిర్ణయంతో సాధారణ ఖైదీల్లా మారిన కశ్మీర్ దిగ్గజ రాజకీయ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ అవమానంతో రగిలిపోతున్నారు. కశ్మీరీలుగా తాము గతేడాది ఆగస్టు 5న ఎదురైన అవమానాన్ని మర్చిపోలేమని ఇప్పటికే ముఫ్తీ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న ఈ ముగ్గురు నేతలను కేంద్రం కశ్మీర్ విభజన తర్వాత ప్రజాభద్రతా చట్టం ప్రయోగించి గృహనిర్బంధాల్లో ఉంచింది. తద్వారా వీరు తమ గొంతు వినిపించే అవకాశం లేకపోయింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఈ ముగ్గురు నేతలు ఒక్కొక్కరిగా బయటికొచ్చారు.
ఏకతాటిపైకి ఆరు పార్టీలు...
కశ్మీర్కు రాజ్యాంగబద్ధ హోదా తొలగించడంతో పాటు ఆర్టికల్ 370, 35ఏ తొలగిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో తీవ్రవాదాన్ని అణచివేసే పేరుతో చేపట్టిన ఈ చర్య వల్ల పరిస్ధితిలో ఎలాంటి మార్పు రాలేదని చెబుతున్న ఆరు రాజకీయ పార్టీలు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ పేరుతో ప్రత్యేక హోదా పోరుకు సిద్ధమవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న ఆయా పార్టీల కూటమి త్వరలో ప్రత్యేక హోదా తిరిగి తెచ్చుకునేందుకు కార్యాచరణ ప్రకటించబోతోంది. ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించాయి.
న్యాయపోరాటమే శరణ్యం..
జమ్మూ-కశ్మీర్ను మూడు ముక్కలుగా విభజిస్తూ ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేస్తూ కేంద్రం గతేడాది తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైనా వాటిపై విచారణ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమకు ఆరో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ హిల్ కౌన్సిల్ ఎన్నికలను రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. ఈ నేపథ్యంలోనే లడఖ్లో రాజకీయ పార్టీలతో హోంమంత్రి అమిత్షా చర్చలు జరిపారు. అయితే ఇదంతా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అబ్లుల్లా, ముఫ్తీ కుటుంబాలు గృహనిర్భందంలో ఉండగానే జరిగింది. అయితే ఇందులో కూడా ఏమీ తేలలేదు. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్గా చేసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పార్టీల కూటమి సిద్ధమవుతోంది.
Recommended Video
కూటమి అజెండా ఇదే...
కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించి తిరిగి ప్రత్యేక హోదా తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన కూటమి.. ఇందులో కశ్మీర్ ముస్లింలదే అనే అనే అంశాన్ని పక్కనబెట్టి స్ధానికులకు ఉద్యోగం, విద్య, భూముల భద్రత వంటి అంశాలన తెరపైకి తీసుకురానుంది. అలాగే స్ధానిక సెంటిమెంట్ను, ప్రజలు ఎదుర్కొన్న అవమానాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు కూటమి సిద్ధమవుతోంది. కేంద్రం నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న లడఖ్, కార్గిల్, జమ్మూ ప్రాంతాల ప్రజలను కలుసుకునేందుకు కూటమి నేతలు వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికల నిర్వహణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కూడా వీరికి ఊతమిచ్చే అవకాశం ఉంది. ఆలోపు కేంద్ర ప్రభుత్వం ఈ కూటమి నేతలతో చర్చలు జరిపి ఓ పరిష్కారం కనుగొంటుందని వీరు భావిస్తున్నారు.