యోగా చేయించారు.. ఇక భద్రత కల్పిస్తారు, మరో రంగంలోకి బాబా రాందేవ్!
పతంజలి బ్రాండ్ ద్వారా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించారు. తాజాగా ఆయన ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించారు.
న్యూఢిల్లీ: పతంజలి బ్రాండ్ ద్వారా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించారు. తాజాగా ఆయన ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించారు.
'పరాక్రమ్ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఏజెన్సీని ప్రారంభించారు. స్వీయ, దేశ భద్రతకు ఉపయోగపడే విధంగా వ్యక్తులను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్థను ప్రారంభించినట్లు ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశారు.
పదవీ విరమణ చేసిన పోలీసులు, సైన్యాధికారులతో యువకులకు శిక్షణ ఇప్పించనున్నారు. ఆర్మీలో చేరే యువకులకు ఎంతటి కఠిన శిక్షణ ఇస్తారో.. ఈ సంస్థలో చేరే యువకులకు కూడా అలాంటి కఠిన శిక్షణ ఇవ్వనున్నట్లు పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.
పరాక్రమ్ సురక్షలో శిక్షణ పొందిన యువకులు ఆర్మీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 22-40 ఏళ్ల వయసు ఉన్న పురుషులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్లో మహిళలకు కూడా ఈ సంస్థలో చేరే అవకాశాన్ని కల్పిస్తామని ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు.
ఈ సంస్థ ద్వారా ఏడాదికి 25-50 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పరాక్రమ్ సురక్షను టాప్ సెక్యూరిటీ ఏజెన్సీలలో ఒకటిగా నిలుపుతామని రాందేవ్ తెలిపారు. ఇప్పటికే బాబా రాందేవ్ ఆయుర్వేద, ఎఫ్ఎంసీజీ వ్యాపారాల్లో మంచి వృద్ధి సాధిస్తున్నారు.