మాజీ సీజే రంజన్ గొగోయ్ కేసులో మరో ట్విస్ట్- కోర్టు ధిక్కార చర్యలకు నో అన్న ఏజీ
ఈ నెలలో ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిపై మీడియాతో పాటు ప్రజల్లోనూ, న్యాయవర్గాల్లోనూ తీవ్ర చర్చ జరిగింది. చివరికి ఓ సామాజిక కార్యకర్త ఆయన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును అపకీర్తి పాలుచేసేలా ఉన్నాయని, ప్రజల దృష్టిలో కోర్టు గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని, కాబట్టి ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గగోయ్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునే విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు. దీనిపై స్పందించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోఖలే అనే సదరు సామాజిక కార్యకర్తకు రాసిన లేఖలో అటార్నీ జనరల్.. రంజన్ గగోయ్ వ్యాఖ్యలు తీవ్రమైనవే అయినప్పటికీ వ్యవస్ధ మేలు కోసమే చేసినట్లుగా భావిస్తున్నామని, వీటి వల్ల సుప్రీంకోర్టు గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు.
ప్రజలకు న్యాయం అందించే విషయంలో జరుగుతున్న పరిణామాలపై అసహనంతో మాత్రమే రంజన్ గగోయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నట్లు అటార్నీ జనరల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాబట్టి గగోయ్పై కోర్టు ధిక్కార చర్యలకు తాను అనుమతి ఇవ్వడం లేదని హక్కుల కార్యకర్త గోఖలేకు రాసిన లేఖలో వేణుగోపాల్ తేల్చేశారు. దీంతో గగోయ్ వ్యాఖ్యల వ్యవహారంలో అటార్నీ జనరల్ స్పందనపై ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది.