రజనీకాంత్ పై మళ్లీ కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు.
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు.
ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయం, సమాజం.. దేనిమీదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు ధైర్యంగా విమర్శలు చేయడం కమల్ హాసన్ కు అలవాటే.
బిగ్ బాస్ టీవీ షో అసభ్యకరంగా ఉందని, తమిళ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతున్న ఈ కార్యక్రమంపై నిషేధం విధించాలని, కమల్ హాసన్ ను అరెస్టు చేయాలని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశంపై బుధవారం రాత్రి కమల్ హాసన్ మీడియాలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తమిళ్ తాయ్ గీతాన్ని కించపరచలేదన్నారు. తనపై చేసిన అభియోగాలన్నీ శుద్ధ అబద్దాలన్నారు.
ఇదేనా? మిగతావి కనిపించవా?
బిగ్ బాస్ షో అసభ్యత గురించి మాట్లాడేవారు క్రికెట్ మైదానంలో డ్యాన్స్ చేసే చీర్ గాళ్స్ పై చర్యలు తీసుకోమని ఎందుకు కోరరని కమల్ హాసన్ ప్రశ్నించారు. దశావతారం చిత్రం తీసినప్పుడు కూడా కొందరు తనను పొగిడితే మరికొందరు విమర్శించారని చెప్పారు. తాను నటించిన అనేక చిత్రాల విడుదలను పలువురు అడ్డుకున్నప్పుడు ప్రజలు, ప్రభుత్వ పెద్దలు వేడుక చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
మీరెప్పుడు రాజకీయాల్లోకి...?
రజనీకాంత్ అభిమానుల మాదిరిగానే కమల్ హాసన్ అభిమానులు కూడా కమల్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ‘మీరెప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడతారు?' అని కమల్ హాసన్ ని ప్రశ్నిస్తే.. ‘ఎప్పుడో వచ్చేశాను..' అని ఆయన బదులిస్తుంటారు.
ఎప్పుడో వచ్చేశానుగా...
ఓటేసినప్పుడు.. ఎప్పుడు నా వేలిపై చుక్కపెట్టారో అప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చేశాను అంటూ చమత్కరిస్తుంటారు కమల్ హాసన్. రాష్ట్రంలో వ్యవస్థ చెడిపోయిందని రజనీకాంత్ ఇటీవల అభిమానులతో జరిపిన సమావేశంలో విమర్శించిన సంగతి తెలిసిందే.
పొరుగు రాష్ట్రాల్లో మంత్రులు భేష్...
అయితే ఇదే విమర్శను తాను ఏనాడు చేశానని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రకాశవంతమైన మంత్రులను చూస్తున్నామని, దురదృష్టవశాత్తూ తమిళనాడులో అలాంటి పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అది వ్యక్తిది కాదు... సమిష్టి అవినీతి...
తమిళనాడు ప్రభుత్వంలో అన్ని శాఖలు అవినీతి కూపాలుగా మారిపోయాయని, లంచగొండితనం పరాకాష్ఠకు చేరుకుందంటూ కమల్ హాసన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదాయానికి మించిన ఆస్తులు అనేది ఒక వ్యక్తికి సంబంధించిన అవినీతి కాదని, అది సమిష్టిగా చేసిన అవినీతి అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాలు డబ్బు కోసం కాదు...
ఒకరు మాత్రమే అవినీతికి పాల్పడి ఉంటే.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఎందుకని ఆమె ఫొటోలు ఉంచారంటూ పరోక్షంగా జయలలిత గురించి కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలనేవి డబ్బు సంపాదించేందుకు కాదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
రజనీని కూడా విమర్శిస్తా.. ఎనీ డౌట్?
రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు మంచి చేస్తే తాను కూడా ప్రశంసిస్తానని, లేదంటే ఇతర పార్టీలపై చేస్తున్నట్లే రజనీ పార్టీ, వ్యక్తిగతంగా రజనీపై కూడా తాను విమర్శలు చేసేందుకు వెనకాడనని చెప్పారు.
అవి ప్రజలకు సేవ చేసే ఉద్యోగాలు...
సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే అనే పదవులు మంచి జీతంతో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఉద్యోగాలనే భావనతో వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని కమల్ వ్యాఖ్యానించారు. తాను తన అభిప్రాయాలను తరచూ వెల్లడిస్తుంటానని, జీఎస్టీపై కూడా తాను కేంద్రాన్ని విమర్శించానని ఆయన గుర్తు చేశారు.
మార్కులు వేయను... ఓటు మాత్రమే వేస్తా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కులు వేయనని, కేవలం ఓటు మాత్రమే వేస్తానని కమల్ హాసన్ చెప్పారు. ఇప్పుడే తన అభిప్రాయం వెల్లడిస్తే.. రహస్యంగా ఓటు వేసే అవకాశం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
అప్పుడలా... ఇప్పుడిలా...
జయలలిత హయాంలో విసుగు, విరక్తిగా మాట్లాడిన కమల్ హాసన్.. ఆమె మరణం తరువాత తన తీరు మార్చుకున్నారు. ప్రస్తుతం విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో సర్వాధికారం, అన్యాయాలపై తాను గళం విప్పుతున్నానని చెప్పుకొచ్చారు.