72రోజులు-19దేశాలు: రోడ్డు మార్గంలో ముంబై-లండన్ చేరిన 73ఏళ్ల బల్దవా(పిక్చర్స్)
ముంబై: ఆ జంటకు వయస్సు ఓ సంఖ్య మాత్రమే. అందుకే అతనికి 73, ఆమెకు 64ఏళ్ల వయస్సుల్లో దేశాలను చుట్టేయాలని తలిచారు. అంతే వేగంగా ఏర్పాట్లు చేసుకున్నారు. భార్య, మనవరాలితో కలిసి ఏకంగా ముంబై నుంచి లండన్కు రోడ్డు మార్గం గుండా ప్రయాణించారు. వారే ముంబైకి చెందిన బద్రి-పుష్ప బల్దవా దంపతులు.
భార్య జోక్ అనుకున్నారు..
2011లో బద్రి బల్దవా లండన్ నుంచి ముంబై వచ్చారు. విమాన ప్రయాణంలో తరచూ భార్య పుష్ప ఆయనకు విండో సీట్ ఇచ్చేది. ఈ క్రమంలోనే విండో సీటులో కూర్చున్న బద్రి బల్దవా విండో నుంచి కిందకు చూడగా ఆయనకు పర్వతాలు చాలా అందంగా కనిపించాయి. ఈ దృశ్యాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతంలో పర్యటించాలని ఆయన భార్యకు విషయం చెప్పారు. అయితే, పుష్ప మాత్రం ఏదో జోక్ చేస్తున్నారని అనుకున్నారు. కానీ, 2016 మేలో చార్ట్ ప్లాన్స్ సిద్ధం చేశారు.
72రోజులు...
ఈ ఏడాది మార్చి 23న తన 64ఏళ్ల భార్య పుష్ప, 10ఏళ్ల మనవరాలు నిశితో కలిసి బీఎండబ్ల్యూ ఎక్స్5 వాహనంలో రోడ్డు ప్రయాణం ప్రారంభించారు బద్రి బల్దవా. సుమారు 72రోజులపాటు సాగిన వారి ప్రయాణంలో 19 దేశాలను చుట్టేశారు. అంతేగాక, మొత్తం 22,200 కి.మీల ప్రయాణించి చివరికి లండన్ చేరుకున్నారు.
గతంలోనూ..
73ఏళ్ల బద్రి స్టీల్ ఎగుమతిదారుడేగాక, చార్టెరడ్ ఎకౌంటెంట్ కూడా. రాజస్థాన్కు చెందిన బల్దవా దంపతులు కర్ణాటకలో పెరిగారు. చివరకు వీరిద్దరు ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బద్రి బల్దవా 2008లో ఎవరెస్ట్ పర్వతంలోని ఓ శిఖరాన్ని అధిరోహించారు. మూడు దశాబ్దాల క్రితం ముంబై నుంచి బద్రినాథ్ కూడా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించారు. 2015లో ఐస్లాండ్ ను చుట్టేశారు. తన మనవరాలు నిశితో కలిసి నార్వే గుండా 24గంటలపాటు నిర్విరామంగా వాహనాన్ని నడిపి నార్త్ కేప్ చేరుకున్నారు.ఆయన అంటార్కిటికాకు కూడా ఆయన ప్రయాణించారు. 90డిగ్రీ నార్త్ వరకు ప్రయాణించిన తొలి భారతీయుడు కూడా బద్రీనే కావచ్చు.
గుర్తుండిపోయేలా..
అంతేగాక, బల్దవాకు 65దేశాల నుంచి వీసా స్టాంప్స్ ఉన్నాయి. అతని భార్య కూడా 55దేశాలవి ఉన్నాయి. కాగా, ఈ రోడ్డు ప్రయాణం తమకు గుర్తుండిపోతుందని అన్నారు బల్దవా. మరోసారి చూడాలనిపించేలా తమ ప్రయాణం కొనసాగిందని తెలిపారు.
పాకిస్థాన్ గుండా పోతే తిరిగొచ్చేవాళ్లం కాదేమో..
ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను బల్దవా వెల్లడించారు. లండన్ ప్రయాణానికి ముందు చాలా ప్రణాళికలు వేసుకున్నారు బద్రి బల్దవా దంపతులు. ఇంఫాల్ వెళ్లి అక్కడ్నుంచి మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, రష్యాల మీదుగా లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, లండన్ వెళ్లేందుకు మరో మార్గం కూడా ఉంది. ఈ మార్గం ఎంచుకుని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ గుండా పోతే మాత్రం తిరిగి ప్రాణాలతో వస్తానో లేదని అనిపించిందని బల్దవా తెలిపారు. టిబెట్ గుండా వెళ్దామన్నా చైనా అనుమతించే అవకాశం లేదని చెప్పారు.
రాయబార కార్యాలయాల్లో బస
కాగా, బల్దవా ఒక్కరే తన ప్రయాణాన్ని కొనసాగించలేదు. ఆయన వెంట ఇంఫాల్ నుంచి మరో 12 వాహనాలు వచ్చాయి. ఈ గ్రూపులో 26మంది యువకులు, ఒక చిన్నారి ఉన్నారు. భారత ప్రభుత్వంతో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. రాత్రిపూట అక్కడే బస చేశారు. థాయిలాండ్ మంత్రిత్వ శాఖ అయితే తమ కోసం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టిందని బల్దవా తెలిపారు.
చైనాలో ఇబ్బందికరం..
థాయిలాండ్ నుంచి బయల్దేరిన బల్దవా.. చైనాను దాటేందుకు 16రోజులు పట్టిందని తెలిపారు. ఉత్తరచైనాలో ప్రతీ నాలుగుగంటలకు వాతావారణంలో మార్పులు జరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దుల్హంగ్లో 24డిగ్రీలుండగా, జినింగ్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు చెప్పారు. అయితే, తమకు స్థానికులు మంచి వసతి కల్పించారని చెప్పారు. వార్సా నుంచి బ్రస్సెల్స్కు ఒకే రోజు ప్రయాణించినట్లు తెలిపారు. వీటి మధ్య దూరం 930కి.మీలని తెలిపారు.
19దేశాల గుండా ప్రయాణం
వార్సా(పోలాండ్)లో బ్రేక్ ఫాస్ట్ చేసి, ఆ తర్వాత కోలోగ్నే(జర్మనీ)లో భోజనం చేశామని తెలిపారు. సాయంత్రం బ్రస్సెల్స్లో డిన్నర్ చేసినట్లు బల్దవా చెప్పుకొచ్చారు. తమ ప్రయాణం 19దేశాల గుండా సాగిందని తెలిపారు. తమ ప్రయాణంలో అనేక అందమైన , అద్భుతమైన ప్రదేశాలను చూశామని చెప్పారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని అన్నారు. చైనాలో మాత్రం రోడ్లు చాలా విస్తారంగా చాలా బాగున్నాయని తెలిపారు. తమ ప్రయాణాన్ని వేగవంతం చేశాయని చెప్పారు. పర్వతాల గుండా వారు వేసిన రోడ్లు బాగున్నాయని చెప్పారు.
వినూత్న అనుభూతి..
విమానంలో ప్రయాణించిన తమకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించడం చాలా మంచి అనుభూతిని ఇచ్చిందని బల్దవా దంపతులు తెలిపారు. అనేక ప్రాంతాలను చూడటం ద్వారా తమకు వినూత్న అనుభూతి కలిగిందని చెప్పారు. విమానంలో ప్రయాణిస్తే ఇవన్నింటినీ మిస్ అవుతామని చెప్పారు.
వయస్సు సంఖ్య మాత్రమే..
తన ట్రావెల్ స్టోరీలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తానని బల్దవా చెప్పారు. ఇవన్ని వారికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. వయస్సు సంఖ్య మాత్రమేనని తలచుకుంటే ఏదైనా చేయవచ్చని బల్దవా అన్నారు. తమ ముంబై నుంచి లండన్ ప్రయాణమే ఇందుకు మంచి ఉదాహరణ అని బల్దవా తెలిపారు.