చివరి అవకాశం: సోనియా గాందీకి 13 పాయింట్ల అజెండాతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ లేఖ
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ అజెండాను అందులో పొందుపర్చారు.
అంతేగాక, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను వివరించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్లో తన సూచనలను పోస్టు చేశారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తిరిగి నిలబెట్టుకోవడానికి ఇదే చివరి అవకాశమంటూ హెచ్చరించారు. ఇటీవలే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిసిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే.
తాను ముందుంచిన సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ పెద్దలు అంగీకరించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.
లేఖలో నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ డ్రగ్స్ సమస్య, వ్యవసాయ సమస్యలు, ఉద్యోగావకాశాలు, విద్యుత్తు, పీపీఏ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, సింగిల్ విండో పారిశ్రామిక విధానం, మహిళా సాధికారత, మద్యం, ఇసుక తవ్వకాలు, రవాణా, కేబుల్ మాఫియా లాంటి 13 అంశాలను తన అజెండాలో పొందుపర్చారు సిద్ధూ.
— Navjot Singh Sidhu (@sherryontopp) October 17, 2021
కాగా, నవజ్యోత్ సింగ్ సిద్దూ కారణంగానే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమయ్యారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ రాష్ట్రానికేగాక, దేశ భద్రతకు కూడా పెను ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు.
Recommended Video
అమరీందర్ సింగ్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. మొదట చన్నీకి మద్దతుగా ఉన్నట్లుగానే కనిపించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కొద్ది రోజుల క్రితం తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నవజోత్ సింగ్ సిద్ధూ నాయకత్వంలోనే జరగాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.