మనసును కదిలించే వీడియో: కలెక్టర్ కాళ్లపై పడ్డ రైతన్న, ఎందుకంటే?
Recommended Video
భోపాల్: పంట పండించి పదమందికి అన్నం పెట్టే రైతన్న కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మదిని కదిలింప చేస్తోంది. మధ్యప్రదేశ్లో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఓ రైతన్న తన సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. కానీ దానికి పరిష్కారం లభించలేదు. చేసేది లేక చివరకు కలెక్టర్ కాళ్ల పైన పడి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని రనౌద్ గ్రామంలో చోటు చేసుకుంది.
కాళ్లు పట్టుకున్న రైతు
కలెక్టర్ కాళ్లు పట్టుకున్న సదరు రైతు వయస్సు 30 ఏళ్లు. తన పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ విషయంలో అతను శివపురి కలెక్టర్ అనురాగ్ కాళ్లు పట్టుకున్నారు. ఈ సంఘటన డిసెంబర్ 28వ తేదీన జరిగింది. సదరు రైతు గోడు విన్న కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ బయటకు రాగానే
శివపురిలోని రనౌద్ గ్రామానికి చెందిన రైతు అజిత్. అతను తన పంట పొలంలో పండిన గోధుమ పంటను చేతబట్టి కలెక్టర్ వద్దకు వెళ్లారు. అక్కడ అధికారులను కలిసేందుకు అతను మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూశాడు. ఆ సమయంలో కలెక్టర్ బయటకు వచ్చాడు.
రూ.40వేలు చెల్లించినా
కలెక్టర్ను చూసిన వెంటనే రైతు అజిత్ వెంటనే అతని కాళ్లపై పడి, తన బాధను చెప్పుకున్నాడు. తాను స్థానిక ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో ట్రాన్స్ఫార్మార్ నిమిత్తం రూ.40వేలు ఫీజుగా డిపాజిట్ చేశానని, కానీ అయిదు నెలలు గడిచినా ఇవ్వలేదని చెప్పుకున్నారు. వాళ్లు ట్రాన్సుఫార్మర్ ఇస్తే కానీ తన పంట చేతికి రాదని వాపోయారు. ట్రాన్సుఫార్మర్ పెట్టక పోవడం వల్ల తన పంట నాశనమవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. రైతు ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
నాయకులు, అధికారులపై నెటిజన్ల ఆగ్రహం
కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు రాజకీయ నాయకులు, అధికారులపై మండిపడుతున్నరు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే ఇది జరిగింది.