అగ్ని నక్షత్రం అంటే ఏమిటి..? ఏ రోజు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది..? శుభమా అశుభమా..!
ఈ ఏడాది ఎండలు బాగానే ఉంటాయని సమాచారం. ముఖ్యంగా మే నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి మే నెలలో వడగాలులు విపరీతంగా ఉంటాయి. సోమవారం మే 4వ తేదీ నుంచి ఈ నెల 28వరకు విపరీతమైన ఎండలు ఉంటాయని అంచనా. అంతేకాదు ఈ సమయంలో వడగాలులు వీస్తాయని సమాచారం. ఇక పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే మే 4 నుంచి మే 28 వరకు అగ్ని నక్షత్రం అని పిలుస్తారు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం.
అగ్నినక్షత్రం సమయంలో వడగాలులు
పంచాంగం ప్రకారం కృతిక నక్షత్రం గుండా సూర్యుడు వెళ్లినప్పుడు దీన్నే అగ్నినక్షత్రం అని పిలుస్తారు. ఆ సమయంలో విపరీతమైన వడగాలులు వీస్తాయి. అంతేకాదు ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉంటాయి. పంచాంగం ప్రకారం ఒక నక్షత్రంను నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది. భరణి నక్షత్రంలోని మూడు నాల్గవ భాగం గుండా సూర్యుడు ప్రవేశించడం, కృతిక నక్షత్రం నుంచి పూర్తిగా ప్రవేశించడం, ఆ తర్వాత రోహిణీ నక్షత్రంలోని తొలిభాగం గుండా ప్రవేశిస్తే దాన్ని అగ్ని నక్షత్రంగా పిలుస్తారు. అగ్ని నక్షత్రంను అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో తలపెట్టిన కార్యాలకు మంచి ఫలితం దక్కదనే భావన ఉంటుంది.
తమిళనాడులో ఒక వేడుకగా అగ్నినక్షత్రం
తమిళనాడులో మాత్రం అగ్నినక్షత్రంను ఒక వేడుకలా నిర్వహిస్తారు. పండగలా జరుపుకుంటారు. మురుగన్కు ఈ పండగను అంకితం చేస్తారు. దీన్ని మొత్తం 14 రోజుల పాటు చేస్తారు. మే 4వ తేదీన ప్రారంభమై 29 మే వరకు వేడుకను నిర్వహిస్తారు. కృతిక నక్షత్రం గుండా సూర్యుడి కదలికల ఆధారంగా ఈ అగ్ని నక్షత్రం వేడుకలను నిర్వహిస్తారు. ఈ నక్షత్రం నుంచే ఒక పండగ పుట్టుకొచ్చిందని హిందువులు విశ్వసిస్తారు. తిరుత్తని, పళని, పలముతిర్సొలాయ్, స్వామిమలై, తిరుచెందూర్ ప్రాంతాల్లో అగ్నినక్షత్రం వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.
మురుగన్కు తమిళులు ప్రత్యేక పూజలు
అగ్ని నక్షత్రం సమయంలో హిందువులు వేల సంఖ్యలో మురుగన్ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఇప్పుడు లాక్డౌన ఉన్న పరిస్థితుల్లో ఆలయాలు బోసిపోయాయి. గిరివాలం అనే పవిత్ర కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణలు ఉదయం సమయంలో సాయంత్రంవేళల్లో చేస్తారు. గిరివాలం కొండపై పెరిగే మొక్కలు పలు రోగాలకు ఔషధాలుగా పనిచేస్తాయనే నమ్మకం ఉంది. ఇక ఆ కొండపై దొరికే కదంబ పూలతో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది మురుగన్కు ఇష్టమైన పూలుగా పేర్కొంటారు. ఇక పలని ఆలయంలో మురుగన్కు నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీటినే తీర్థంగా ఇస్తారు. ఈ తీర్థాన్ని కొందరు భక్తులు తమతో పాటే ఇళ్లకు తీసుకెళుతారు. ఇక అగ్ని నక్షత్రం సమయంలో సూర్యోదయం మే 4న సూర్యోదయం ఉదయం 5గంటల55 నిమిషాలకు జరుగుతుండగా సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు జరుగుతుంది.
అగ్నినక్షత్రం శుభమా అశుభమా..?
ఇక అగ్నినక్షత్రం సమయంను చాలామంది అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. అంతేకాదు డబ్బులు కూడా ఒకరికి అప్పుగా ఇవ్వరు ఒకరి నుంచి అప్పుగా తీసుకోరు. ఇక పూర్వకాలంలో కూడా అగ్నినక్షత్ర సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేసేవారు కాదు. ఇది అప్పటి నుంచే కొనసాగుతూ వస్తోంది. ఈ సమయంలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరు.