మార్కుల కోసం.. ఆ పని చేయాలని?: బాలికపై ప్రిన్సిపాల్ అరాచకం..
పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న ఓ బాలికను మభ్యపెట్టాడు. తన ఛాంబర్ కు పిలిచి, బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఆగ్రా: బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని చెప్పాల్సిందిపోయి.. మార్కులు రావాలంటే తనతో సాన్నిహిత్యంగా మెలగాలని మెలిక పెట్టాడు ఓ మాస్టారు. అంతేనా!, లైంగిక పాఠాలు నేర్పించడం మొదలుపెట్టి.. ఆ తతంగాన్ని తన ఫోన్ లో రికార్డు కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా.. ఓ వాట్సాప్ గ్రూపులో దాన్ని షేర్ చేయడంతో.. సదరు మాస్టారు నిర్వాకం బయటపడింది.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగ్రా శివారులోని సాధాన్ గ్రామంలో ఉన్న శ్రీమతి బదామీ దేవి పబ్లిక్ స్కూలు ప్రిన్సిపాల్ జవహర్ సింగ్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న ఓ బాలికను మభ్యపెట్టాడు. తన ఛాంబర్ కు పిలిచి, బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
బలవంతంగా బాలికతో అసభ్య చేష్టలకు దిగాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీసి.. ఓ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. ప్రిన్సిపాల్ నిర్వాకం గురించి బాధిత బాలిక.. తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలికను లైంగిక వేధిస్తూ చిత్రీకరించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోను ఓ వాట్సాప్ గ్రూపులో పోలీసులు గుర్తించారు.
ప్రిన్సిపాల్ జవహర్ పై ఐపీసీ సెక్షన్ 354, ఐటీ మాక్ట్ 67, బి, ఎస్సీ, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను దళిత సామాజికవర్గానికి చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం జవహర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.