బీహార్ ప్రజల తీర్పు వారికి కనువిప్పు కావాలి: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను కాదని బీజేపీ అతిపెద్ద రెండో అతిపెద్ద పార్టీగా అవరించిన విషయం తెలిసిందే. ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాగా, జేడీయూ మూడో స్థానానికి పరిమితమైంది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినవారికి బీహార్ ప్రజల తీర్పు చెంబదెబ్బలాంటిదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఛీకొడుతున్నారని రవిశంకర్ వ్యాఖ్యానించారు. అప్పుడు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు. బీహార్ రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున ఎన్డీఏకు ఓటు వేశారని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వాన్ని వారంతా బలపర్చారని చెప్పుకొచ్చారు. మోడీ పిలుపు మేరకు నితీష్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్నారు.
నితీష్ కుమార్ను వ్యతిరేకించి చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లి సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారని.. అయితే, ఆయన ఎలాంటి ఫలితాలు సాధించారో అందరికీ తెలిసిందేనని అన్నారు కేంద్రమంత్రి రవిశంకర్. ఎన్నికల్లో ఓటమిపాలైన ఆర్జేడీ మహా కూటమి నేతలు నిరాశతోనే ఈవీఎంలపై ట్యాంపరింగ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాళ్లు గెలిచిన చోట్ల కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లు ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
Recommended Video
నవంబర్ 10న వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీకి 75, బీజేపీకి 74, జేడీయూ 43, కాంగ్రెస్ 19, ఎల్జేపీ 1, ఇతరులు 31 స్థానాలు వచ్చాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకు 125 సీట్లు రాగా, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి 110 స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్డీఏ మరోసారి బీహారా్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.