వ్యవసాయ బిల్లులు: ఎన్డీఏకు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ షాకిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రికల్చర్ బిల్లులను ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం రాత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఓ జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రికల్చర్ బిల్లులను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తాము పంజాబ్ రైతుల పక్షంగానే ఉంటామని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు.
తాము మొదట్నుంచి ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కూడా కేంద్రానికి తన వ్యతిరేకతను తెలియజేశారని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం వెనక్కితగ్గకుండా బిల్లులను ఆమోదింపజేసిందని అన్నారు. బిల్లులో పలు మార్పులను సూచించామని, అయితే వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
ఈ నేపథ్యంలోనే తాము పోరాటం చేస్తున్నామని, వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. అంతేగాక, ఎన్డీఏ ప్రభుత్వంలో మొదట్నుంచి భాగస్వామిగా ఉన్న తమ పార్టీ.. ఇక ఈ కూటమిలో కొనసాగడంపై సమీక్షిస్తామని సుఖ్బీర్ సింగ్ స్పష్టం చేశారు. పార్టీ కోర్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Recommended Video
ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ కూటమిలోని శిరోమణి అకాలీదళ్ సహా విపక్షాలు, రైతు సంఘాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ కేంద్రం మెజార్టీ ఉండటంతో ఈ మూడు బిల్లులకు పార్లమెంటులో ఆమోదం తెలిపింది. రైతులకు మేలు చేసే బిల్లులను అడ్డుకోవడం ఎంతమాత్రం సరికాదని కేంద్రం పేర్కొంది.