జరిగిందొకటి..చూపించేది మరొకటి: వ్యవసాయ రంగంలో నివేదికను మార్చి ఇవ్వనున్న కేంద్రం
దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతులపై భారీ స్థాయిలో పడిందని వారు ఊహించని రీతిలో నష్టపోయారంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు నివేదిక అందిందని ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే కథనం ప్రచురించింది. ఈ నివేదికను గతవారం పార్లమెంటరీ ప్యానెల్ ముందుంచినట్లు ఇండియా టుడే తెలిపింది. ఒక వారం క్రితం వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికలో పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులు చాలా నష్టపోయారని ఆ సమయంలో విత్తనాలు,పురుగుల మందు కొనేందుకు కూడా వారి దగ్గర డబ్బులు లేక అల్లాడిపోయారని పేర్కొంది.
అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థులు ఈ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఇండియా టుడే పేర్కొంది. అంతేకాదు ఈ రిపోర్టు సరైనది కాదంటూ వారి వాదించడమే కాదు ఆ నివేదికపై వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి ఆమోద ముద్ర కూడా వేయలేదని వారు చెప్పుకొచ్చినట్లు ఇండియాటుడే తన కథనంలో వెల్లడించింది. ఈ కమిటీకి కేంద్ర మాజీ మంత్రి వీరప్పన్ మొయిలీ నేతృత్వం వహించారు. ఈ రిపోర్టు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని వీరప్ప మొయిలీ తన ట్విటర్లో పేర్కొన్నారు.
నివేదికను మార్చే యోచనలో కేంద్రం
వ్యవసాయ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మరో రిపోర్టును సమర్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని ఇండియాటుడే సంపాదించింది. ఇందులో వ్యవసాయంలో మంచి అభివృద్ధిని నమోదు చేసుకుందని,విత్తనాల పంపిణీ కూడా బాగా జరిగిందని గడిచిన సంవత్సరాలతో పోలిస్తే రబీ పంటలు బాగా పండాయని అందులో ఉన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం తీసుకున్న చొరవతో పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయంపై పడలేదని కొత్త రిపోర్టులో పేర్కొందని ఇండియా టుడే వెల్లడించింది. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయ రంగం మరింత సులభతరం అయ్యిందని రిపోర్టులో పేర్కొన్నట్లు ఇండియాటుడే చెప్పింది.
కొత్త రిపోర్టు పై మండిపడుతున్న విపక్షాలు
రైతులు ఖరీఫ్ పంట వేసి ఆ పంట చేతికంది వచ్చే సమయంలో పెద్దనోట్లు రద్దు చేయడంతో చాలా ఇబ్బంది పడ్డారని పాత రిపోర్టులో ఉన్నట్లు చెప్పిన ఇండియా టుడే... అదే సమయంలో రబీ పంట సాగుకు డబ్బులు సమకూర్చుకుంటున్న సమయంలో పెద్ద నోట్లు రద్దు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక కొత్త రిపోర్టులో మాత్రం ఇందుకు భిన్నంగా రాసినట్లు ఇండియాటుడే వెల్లడించింది. అయితే కమిటీలోని విపక్ష పార్టీ సభ్యులు దీన్ని తప్పు బట్టారు. ముందు ఇచ్చిన రిపోర్టులో పెద్ద నోట్ల రద్దుతో రైతులు నష్టపోయారని ఉండగా కొత్త రిపోర్టును మార్చి ఇవ్వడమేంటని వారు మండిపడ్డారు.
ఎన్నికలవేళ నివేదిక బయటికొస్తే ఇబ్బందులు తప్పవనే భావన
ఇప్పటికే విపక్షపార్టీలు ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో పెద్దనోట్ల వల్ల దేశం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలకు వివరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి నివేదిక బయటకొస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉన్నందున వ్యవసాయశాఖ రిపోర్టును ఒకవారం సమయంలో తిరిగి మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. కొత్త రిపోర్టును తిరస్కరించే యోచనలో విపక్ష సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. డీమోనిటైజేషన్తో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో స్పష్టంగా ఉన్న రిపోర్టును మార్చి కొత్త రిపోర్టు సమర్పిస్తే ఒప్పుకునే ప్రసక్తేలేదని విపక్ష పార్టీలు చెబుతున్నాయి.