సోనియా, రాహుల్, మన్మోహన్ల అరెస్ట్!: అధినేత్రికి అగస్టా మరింత చిక్కు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీని బెజెపి టార్గెట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసిన అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో సోనియా గాంధీకి మరింత విషమ పరిస్థితి ఎదురయ్యేలానే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో ఆమె పేరు ప్రస్తావన స్పష్టంగా ఉంది.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు నాలుగుసార్లు ఆమె పేరు ఆ తీర్పు కాపీలో ప్రస్తావనకు వచ్చింది. అగస్టా మాజీ సీఈఓ గుస్పెపీ ఓర్సీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు గతంలోనే ఈ కేసుకు సంబంధించి ఇటలీ కోర్టు తీర్పు వెలువరించింది.
తాజాగా ఈ తీర్పునకు సంబంధించిన కాపీ వెలుగులోకి వచ్చింది. మొత్తం 225 పేజీలున్న ఈ తీర్పులో సోనియా గాంధీ పేరు నాలుగు చోట్ల ప్రస్తావనకు వచ్చింది. తీర్పు కాపీలోని 193, 204 పేజీల్లో సోనియా పేరును సిన్యోరా గాంధీగా జడ్జీ నాలుగు సార్లు ప్రస్తావించారు.