అగస్టా వెస్ట్లాండ్ కేసు: ఈడీ విచారణలో సోనియా పేరును ప్రస్తావించిన క్రిస్టియన్
యూపీఏ హయాంలో అగస్టా వెస్ట్ల్యాండ్ చాపర్ కొనుగోళ్ల విషయంలో తీగలాగుతుంటే డొంక బయటపడతోంది. ఇప్పటికే ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈడీ విచారణలో సోనియా గాంధీ పేరును క్రిస్టియన్ ప్రస్తావించాడని ఈడీ ఢిల్లీ పాటియాలా కోర్టుకు తెలిపింది. అయితే సోనియా గాంధీ పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఒప్పందం నుంచి ఎలా తొలగించడం జరిగింది... ఆపైన ఒప్పందం టాటాకు ఎలా వెళ్లిందనే దానిపై చెప్పినట్లు ఈడీ కోర్టుకు వివరించింది.
విచారణ సందర్భంగా సోనియా రాహుల్ పేర్లు ప్రత్యక్షంగా చెప్పనప్పటికీ ఇటలీదేశానికి చెందిన మహిళ కుమారుడు భారత ప్రధానిగా ఎలా అవుతారో కూడా క్రిస్టియన్ ఈడీకి చెప్పాడట. ఇక క్రిస్టియన్ తరపున న్యాయవాది అతన్ని కలవకుండా చూడాలని ఈడీ ఆదేశించింది. క్రిస్టియన్ను నోరువిప్పకుండా చూసే బాధ్యతను ఆయన లాయరుకు కొందరు అప్పగించారని ఈ నేపథ్యంలోనే న్యాయవాది జైల్లో ఉన్న క్రిస్టియన్ను కలవకుండా చూడాలని ఈడీ ఆదేశించింది.
క్రిస్టియన్ మైఖేల్, ఇతర వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలో 'ఆర్ ' అనే అక్షరంతో సంభాషణలు జరిగాయని ఇంతకీ ఆర్ అనే పెద్ద హస్తం ఎవరై ఉంటారనే దాన్ని చేధించే పనిలో ఈడీ ఉంది. మైఖేల్ డాక్యుమెంట్లు తమకు అందజేశారన్న వాదనతో తాము ఏకీభవిస్తున్నామని అయితే ఈడీ పట్టించుకోకపోవడం వల్లే డాక్యుమెంట్లు తమ చేతికి వచ్చినట్లు మైఖేల్ లాయర్ ఆల్జో కే జోసెఫ్ తెలిపారు. ఇది పూర్తిగా ఈడీ తప్పిదమే అని వెల్లడించారు. కేసు విచారణ చేసిన కోర్టు మరో ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.