అగస్టావెస్ట్లాండ్ కేసు: రాజీవ్ సక్సేనాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ: వీవీఐపీ చాపర్ అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన రాజీవ్ సక్సేనాకు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 3,600 కోట్లు విలువ చేసే ఈ ఒప్పందంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై రాజీవ్ సక్సేనాను అరెస్టు చేయడం జరిగింది. రూ. 5 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరితో ష్యూరిటీ సంతకాలు తీసుకుని ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ రాజీవ్ సక్సేనాకు బెయిల్ మంజూరు చేశారు. బయటకు వెళ్లిన తర్వాత సాక్షులను కానీ సాక్షాధారాలను కానీ ట్యాంపరింగ్ చేయరాదనే కండిషన్తో రాజీవ్ సక్సేనాకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అంతేకాదు దేశం విడిచి వెళ్లరాదని... విచారణ సంస్థ ఎప్పుడు పిలిచినా వచ్చి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
రాజీవ్ సక్సేనా దుబాయ్లోని రెండు కంపెనీలు అయిన యుహెచ్వై సక్సేనా, మాట్రిక్స్ హోల్డింగ్స్ సంస్థల్లో డైరెక్టరుగా ఉన్నాడు. అగస్టా వెస్ట్లాండ్ కేసులో రాజీవ్ సక్సేనా పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. రాజీవ్ సక్సేనాతో పాటు అతని భార్య శివాని, అగస్టా వెస్ట్లాండ్ కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్, అగస్టావెస్ట్లాండ్లో మాజీ అధికారిగా పనిచేసిన తిసెప్పీ ఓర్సీ, బ్రూనో స్పాగనోలిని, మాజీ ఎయిర్ ఛీఫ్ ఎస్పీ త్యాగిల పేర్లను కూడా ఈడీ ఛార్జ్షీట్లో దాఖలు చేసింది.
జనవరి 1, 2014లో ఫిన్మెకానికాస్ అనుబంధ సంస్థ అయిన అగస్టావెస్ట్లాండ్తో ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందంలో ఏదో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో నాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ను రద్దు చేసింది. ఒప్పందాన్ని చేజిక్కించుకునేందుకు రూ.423 కోట్లు పక్కదారి మళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి.