ఆగస్టా స్కామ్లో సోనియాకు ఊరట: త్యాగితో చేతులే...
ముంబై: అగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల వ్యవహారంపై మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైకైల్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఊరట కలిగించే మాట చెప్పారు. ఏ దశలో కూడా తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని గానీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను గానీ కలవలేదని చెప్పారు.
అగస్టా వెస్ట్ల్యాండ్ వ్యవహారంలో ముడుపుల వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తున్న సమయంలో క్రిస్టియన్ మైకేల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అబుదబిలో 'టివి టుడే'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లేదా అప్పటి రక్షణమంత్రి ఎకె ఆంటోనిని మీరు కలిసారా అని మైఖేల్ను అడిగినప్పుడు 'లేదు...ఆ ముగ్గురినీ ఎప్పుడూ కలుసుకోలేదు' అని ఆయన జవాబిచ్చారు.
అయితే ఒకసారి తాను అప్పటి ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎస్.పి.త్యాగితో ఢిల్లీలో కరచాలనం చేసిన్టటు మాత్రం చెప్పారు. అది కూడా అన్యమనస్కంగానే చేశానని, ఇటాలియన్ వ్యాపారి గుయిడో హస్చకె, మరో మధ్యవర్తితో త్యాగికి సంబంధాలున్నాయని, దాంతో తాను త్యాగికి దూరంగా ఉన్నానని అన్నారు.
బహుశా జింఖానా క్లబ్లో త్యాగిని తాను కలుసుకుని ఉండొచ్చునని, అప్పుడే ఆయనతో కరచాలనం చేసినట్టు గుర్తు అని చెప్పారు. బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి గురించి కూడా ఆయన మాట్లాడారు. అగస్టా డీల్ వ్యవహారంలో ఆయనను తప్పుదారి పట్టిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికకు సంబంధించిన పత్రాలు సుబ్రహ్మణ్యస్వామి వాదనకు ప్రధాన ఆధారం కావచ్చని అన్నారు. నిజానికి అగస్టా డీల్ ప్రాధాన్యతను బట్టి కాగ్ ఇచ్చిన నివేదిక హడావిడిగా తయారు చేసిందేనన్నారు. వారు (కాగ్) ఎంతమాత్రం ఏవియేషన్ నిపుణులు కాదని, బ్యూరోక్రాట్లేనని మైకేల్ వ్యాఖ్యానించారు.