తాయిలం షురూ: ఎన్నికలకు ముందు సాధువులకు పెన్షన్లు
లక్నో: ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ప్రతిఒక్క వర్గానికి తాయిలాలు ప్రకటించడం కొత్తేమీ కాదు. ఇక సార్వత్రిక ఎన్నికలకు మూడునెలల సమయం ఉన్న నేపథ్యంలో యోగీ సర్కార్ కూడా తాయిలాలు ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్లోని సాధువులకు పెన్షన్ ఇచ్చేందుకు యోగీ సర్కార్ నిర్ణయించింది. 60 ఏళ్లు అంతకు పైబడి వయసున్న సాధువులకు ఈ పెన్షన్ ఇస్తామని యోగీ సర్కార్ తెలిపింది.
పెన్షన్లు రాష్ట్ర పెన్షన్ పథకం కింద సాధువులకు అందజేస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం. జనవరి 30 వరకు సాధువులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రయాగరాజ్లో కుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం విశేషం. ఈ కుంభమేళలో కొన్ని లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఒంటరిగా జీవిస్తున్న ప్రతిఒక్కరికి రూ.500 పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు ఇది రూ. 400 గా ఉన్నింది. ఇదే పథకం కింద సాధువులకు కూడా పెన్షన్లు అమలు చేస్తామని యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సాధువులకు పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే... దీనిపై నిప్పులు చెరిగాయి విపక్షాలు. ఎన్నికల ముందే సాధువులు గుర్తుకొచ్చారా అని విమర్శలు సంధించారు. ఎన్నికలకు ముందు సాధువులను, ఇతర హిందువులను తమవైపు తిప్పుకునేందుకే యోగీ ఆదిత్యనాథ్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు వేషాలు వేసే ఆర్టిస్టులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.