ఏరో ఇండియా షో జరగబోతున్న వేళ... భారత్తో రక్షణ సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
ప్రతీ రెండేళ్లకొకసారి భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన బుధవారం(ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరం వేదికగా మూడు రోజుల పాటు ఈ ఏరో షో జరగనుంది. తొలిసారి అమెరికాకు చెందిన బీ-1 ల్యాన్సర్ ప్రీమియర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇందులో భాగం కానుంది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ప్రతినిధి డాన్ హెఫ్లిన్ మంగళవారం(ఫిబ్రవరి 2) వెల్లడించారు.
ఇండియన్ ఎయిర్ షోలో అమెరికా ఎయిర్క్రాఫ్ట్ పాల్గొనడం భారత్తో అమెరికా సంబంధాలకు ప్రత్యక్ష నిదర్శనమని హెఫ్లిన్ పేర్కొన్నారు. భారత్కు అమెరికా నమ్మకమైన రక్షణ భాగస్వామి అని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు పరస్పర సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాయన్నారు. భారత్తో తమ రక్షణ సహకార పరిధిని అమెరికా గణనీయంగా విస్తరించిందన్నారు.
ఏరో ఇండియాలో అమెరికా పాల్గొనడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ భాగస్వామ్యానికి సంబంధించి వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందని యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డిప్యూటీ అండర్ సెక్రటరీ కెల్లీ ఎల్ సెబోల్ట్ అన్నారు. భారత్తో రక్షణ ఒప్పందాల పరిధిని మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. యునైటెడ్ స్టేట్స్ నార్తర్న్ కమాండ్,లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ కె.క్రుమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ 19 క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతం దిశగా కృషి చేస్తున్నాయని... మున్ముందు మరిన్ని సంయుక్త కార్యకలాపాలను చేపట్టగలమని అన్నారు.
కాగా, ఏరో షో జరిగే ప్రదేశంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధానంగా వైమానిక ప్రదర్శనల సందర్భంగా ఎటువంటి దుర్ఘటనలు సంభవించకుండా యలహంక చుట్టుపక్కల 45 చదరపు కిలోమీటర్ల పరిధిలో అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రిడ్, సబ్ గ్రిడ్, మైక్రో గ్రిడ్లుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ప్రదర్శనలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో విన్యాసాల సమయంలో ఢీకొని కూలిపోవడం, పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు కాలిపోవడం వంటి దుర్ఘటనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి అటువంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తపడుతున్నారు.