ఆసక్తికరంగా బెంగాల్ పోరు- సీఏఏ, ఎన్సార్సీపై బీజేపీ మౌనం-మమత రివర్స్తో సీన్ మారిందిలా
అస్సాంతో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) అమలు చేయాలని భావించిన బీజేపీ త్వరలో జరిగే బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు అంశాలను పక్కనబెట్టేసింది. ఈ రెండు అంశాలపై అస్సలు మాట్లాడొద్దని తమ నేతలకు కాషాయ పెద్దలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీటిపై మాట్లాడితే బెంగాల్లో ఓటమి తప్పదనే అంచనాకు బీజేపీ వచ్చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చ మొదలైంది. సీఎం మమతపై మిగతా విషయాల్లో చిర్రుబర్రులాడుతున్న కాషాయ సైన్యం.. వీటిపై మాత్రం మౌనం వహించడం వెనుక కారణాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
సీఏఏ, ఎన్సార్సీతో బెంగాల్లో బీజేపీ పాగా
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్సార్సీలను అమలు చేయడం ద్వారా బంగ్లాదేశ్ నుంచి విభజన తర్వాత బెంగాల్కు తరలివచ్చిన వారికి గుర్తింపు కల్పిస్తామన్న నినాదంతో బీజేపీ భారీగా లబ్దిపొందింది. అప్పటివరకూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్ధులుగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను తోసిరాజని బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా అవతరించింది. బెంగాల్లో 42 ఎంపీ సీట్లకు గానూ 18 సీట్లు సాధించి బీజేపీ అప్పట్లో సత్తా చాటుకుంది. అయితే రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది.
మమత రివర్స్తో బీజేపీకి చుక్కలు
2019 ఎన్నికలకు ముందు విదేశాల నుంచి తరలివచ్చి భారత్లో పాగా వేసిన వారికి గుర్తింపు ఇస్తామని భరోసా కల్పించిన బీజేపీ అధికారంలోకి రాగానే అసోంలో సీఏఏ, ఎన్సార్సీ అమలు చేసింది. ఇందులో ఎదురైన తప్పిదాలు బీజేపీకి తల బొప్పి కట్టించగా.. బెంగాల్ వంటి వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం మంటలు పుట్టించాయి. ఇక్కడ ఒకప్పుడు సీఏఏ, ఎన్సార్సీ అమలుతో మీకు పౌరసత్వం, గుర్తింపు కల్పిస్తామని చెప్పిన బీజేపీ... అనంతరం మమత వీటికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంతో ఇరుకునపడింది. తన శవంపై నుంచి వెళ్లి సీఏఏ, ఎన్సార్సీ అమలు చేయడంటూ మమత విసిరిన సవాల్కు బీజేపీ వద్ద జవాబు లేకుండా పోయింది.
బీజేపీకి అక్కడ మతువాలే గతి
పశ్చిమబెంగాల్లో ఒకప్పుడు బంగ్లాదేశ్ నుంచి విభజన తర్వాత తరలి వచ్చిన మతువాలతో పాటు పౌరసత్వం లేని ఇతర గ్రూపులు, ప్రజలు బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 సీట్లు గెల్చుకుంది. అయితే ఆ తర్వాత మమత ఉద్యమంతో బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం ఆరు ఎంపీ సీట్లలో ప్రభావం చూపే మతువాల గురించి ఆలోచించకుండా మమత థైర్యంగా సీఏఏ, ఎన్సార్సీలను వ్యతిరేస్తుండగా.. మతువాలను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేసే స్ధితిలో బీజేపీ లేదు. దీంతో ఈ రెండు అంశాలపై ఏం చేయాలనే డైలమాలో బీజేపీ పడిపోయింది.
మారిన పరిస్ధితుల్లో సీఏఏ, ఎన్సార్సీపై మౌనం
ఒకప్పుడు బెంగాల్లో మమత ధిక్కరించినా సీఏఏ, ఎన్సార్సీ అమలు ఆగబోదంటూ హుంకరించిన బీజేపీ నేతలు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో అసలు ఆ రెండు అంశాల జోలికే పోవడం లేదు. తాజాగా బెంగాల్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు బీజేపీ ఇన్ఛార్జ్ కైలాశ్ విజయవర్గీయ సైత సీఏఏ, ఎన్సార్సీ అమలు కోసం నిబంధనల రూపకల్పన జరుగుతుందని, దీనికి సమయం పడుతుందని చెప్పి తప్పించుకున్నారు. మిగతా నేతలను అయితే ఆ విషయం కూడా మాట్లాడొద్దంటూ నిషేధం విధించారు. దీంతో సీఏఏ, ఎన్సార్సీ అంశాలు లేకుండానే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అజెండా ఉండబోతోందని అర్ధమైపోయింది.