‘నమస్తే ట్రంప్’ స్టేడియంలో కూలిన గేట్లు.. వీడియో వైరల్.. లైవ్ లో బాహుబలి పాటలు..
ప్రతిష్టాత్మక 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి కొద్ది గంటల ముందు మోతేరా స్టేడియం వద్ద అపశృతి చోటుచేసుకుంది. అహ్మదాబాద్ సిటీకి కొద్దిదూరంలో ఉన్న ఈ స్టేడియంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సుమారు లక్ష మందిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆదివారం అహ్మదాబాద్ లో వాతావరణం ఒక్కసారే మారిపోయి, బలమైన గాలులు వీయడంతో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఇక్కడ బాహుబలి పాటలతో ట్రంప్ కు స్వాగతం పలకనున్నారు.
'నమస్తే ట్రంప్' ప్రోగ్రామ్ కోసం ట్రంప్, మోదీలు నేరుగా స్టేడియంలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేసిన అధికారులు.. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా మరో ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం ఆ ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో ప్రధాన స్టేడియం దగ్గరున్న ద్వారంతోపాటు కొంచెం దూరంలో ఏర్పాటుచేసిన స్వాగత తోరణం కూడా కూలిపోయింది. రెండు ఘటనల్లోనూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రవేశ ద్వారం కూలిపోయిన ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ రెండు ప్రమాదాలు చాలా చిన్నవేనని, గేట్లను తిరిగి యధాస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ మీడియాకు తెలిపారు.
కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ ఎంట్రీ సందర్భంగా 'బాహుబలి' సినిమాలోని 'జై జై కారా (దండాలయ్యా)' పాటను సింగర్ కైలాశ్ ఖేర్ లైవ్ లో ఆలపించనున్నారు. సుమారు 1.25 లక్షల మంది ప్రేక్షకులు కూడా తనతో గొంతుకలుపుతారని ఖేర్ చెప్పుకొచ్చారు. ఏమాత్రం వీలుచిక్కినా.. బాహుబలి పాటకు ట్రంప్ తో డ్యాన్స్ చేయిస్తానని ఖేర్ చమత్కరించారు. మరోవైపు ట్రంప్ ను బాహుబలిగా మార్ఫింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.