రామమందిరం నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోన్న వేళ..అయోధ్యలో కలకలం: అర్చకుడి సహా!
అయోధ్య: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యప్రదేశం అయోధ్యలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోన్న కొద్దీ అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి ఎవరినీ వదలట్లేదు. తాజాగా అయోధ్య రామజన్మభూమి ఆలయ అర్చకుడొకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతో పాటు రామజన్మభూమి ప్రదేశానికి గస్తీ కాస్తోన్న 16 మంది భద్రతా సిబ్బందికీ కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఫలితంగా.. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
రామమందిరం నిర్మాణానికి వచ్చేనెల 5వ తేదీన భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానాన్ని పంపించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విషయంలో ప్రధాన లిటిగెంట్గా ఉన్న వక్ఫ్బోర్డు ప్రతినిధులకు కూడా తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రాలను పంపించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తన ప్రతాపాన్ని చూపించింది.
రామజన్మభూమి ఆలయ అర్చకుడు ప్రదీప్ దాస్ కరోనా బారిన పడ్డారు. నిత్యం రామజన్మభూమి ఆలయంలో స్వామివారికి పూజల చేసే నలుగురు అర్చకుల్లో ప్రదీప్ దాస్ ఒకరు. ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ సారథ్యంలో ఈ నలుగురూ స్వామివారికి నిత్యం పూజలు చేస్తుంటారు. ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాల పర్యవేక్షించే ఆలయ అర్చకుల్లో ప్రదీప్ దాస్ కూడా ఉన్నారు. అనూహ్యంగా తలెత్తిన ఈ ఘటనతో ఉత్తర ప్రదేశ్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలను చేపట్టారు. అర్చకుడు ప్రదీప్ దాస్, 16 మంది భ్రదతా సిబ్బందిని క్వారంటైన్లోకి పంపించారు. వారికి వైద్యాన్ని అందిస్తున్నారు.
Recommended Video
భూమిపూజ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు రామజన్మభూమి ఆలయ అర్చకులు, వారి కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బందికి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ దాస్కు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీని ప్రభావం.. భూమిపూజ పనులపై పడక పోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఆలయ నిర్మాణ భూమిపూజ కొనసాగుతుందని తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చెబుతున్నారు. భూమిపూజ కోసం 200 మందికి మాత్రమే అనుమతి ఉందని వారు వెల్లడించారు.