తెరచుకున్న శబరిమల ఆలయం: 10 మంది ఏపీ మహిళలను వెనక్కి పంపారు
తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం శనివారం తెరచుకుంది. 41 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 10 మంది మహిళలను అక్కడ పోలీసులు వెనక్కి పంపారు.
sabarimala verdict: పేర్లు నమోదు చేసుకున్న మహిళలు, ఎంతమందంటే.?
పది మంది ఏపీ మహిళలు వెనక్కి..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శబమరి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 10-50 ఏళ్ల మధ్య వయస్సున్న పది మహిళలను పంబా నుంచే వెనక్కి పంపించారు. అయ్యప్ప దేవాలయానికి పంబా కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
జిల్లా వ్యాప్తంగా పోలీసుల మోహరింపు
శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ప్రధాన పూజారి మహేశ్ కండారూ తెరిచారు. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వస్తున్న మహిళలకు ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో పథనమథ్తిట్ట జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మండల పూజ నేపథ్యంలోనే..
మండల పూజ పర్వదినాల నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరిచారు. శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించామని జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలను ఈ ప్రాంతంలో వివిధ చోట్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో..
కాగా, 2018, సెప్టెంబర్ 28న ఆలయం లోపలికి మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. అయితే, తాజాగా 2018లో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటామని పలు సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి.