నాలుగు రోజుల్లో ట్రంప్ పర్యటన: రోమియో డీల్కు గ్రీన్ సిగ్నల్: మోడీ సర్కార్ కీలక నిర్ణయం .. !
Recommended Video
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆరంభం కానుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మనదేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.. ఒక్కటొక్కటిగా!. అమెరికాతో గల దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఆ నిర్ణయాలు ఉంటున్నాయి.
హుక్కా బార్లలో భారీగా కాల్పులు: విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు: సినీ ఫక్కీలో.. !
2.4 బిలియన్ డాలర్ల విలువ చేసే..
తాజాగా- అమెరికా తయారు చేసిన నౌకాదళ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ విలువ 2.4 బిలియన్ డాలర్లు. రక్షణశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఈ నిధులతో నౌకాదళ అవసరాల కోసం మొత్తం 24 హెలికాప్టర్లను కొనుగోలు చేయబోతోంది. మూడేళ్ల కాల వ్యవధిలో అవి మనదేశానికి అందొచ్చని తెలుస్తోంది.
25న సంతకాలు..
ఈ 24 హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అవసరమైన పరస్పర అవగాహన ఒప్పందాలపై భారత్, అమెరికా దేశాల రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య చోటు చేసుకునే ముఖాముఖి భేటీ సందర్భంగా సంతకాలు చేస్తారని అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి ఎంహెచ్ - 60 రోమియో మల్టీ రోల్ హెలికాప్టర్ల కొనుగోలు చేస్తారు. అమెరికాకు చెందిన లాక్హీద్ మార్టిన్ సంస్థ ఈ హెలికాప్టర్లను తయారు చేస్తుంది.
ఎన్నో ప్రత్యేకతల రోమియో..
ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లకు అనేక ప్రత్యేకతలు ఉంటాయి. జలాంతర్గాములను పసిగట్టే సామర్థ్యం దీనికి మాత్రమే సొంతం. సముద్ర ఉపరితలం నుంచి 400 మీటర్ల లోతు వరకు పరిభ్రమించే జలాంతర్గాములను ఇట్టే పసిగట్ట గలదని చెబుతున్నారు. శతృదేశాలకు చెందిన జలాంతర్గాములను గుర్తించిన వెంటనే ధ్వంసం చేయగల నైపుణ్యం దీనికి ఉంటుంది. సోనార్ టెక్నిక్, టార్పెడోలను తన వెంట మోసుకెళ్లగలుగుతుంది.
ఆకాశం నుంచి భూఉపరితలానికి..
ప్రస్తుతం భారత నౌకాదళంలో ఇదే రకానికి చెంది హెలికాప్టర్లు పరిమితంగా ఉన్నాయి. వాటితో పాటు జలాంతర్గాములను ధ్వంసం చేయగల టార్పెడోలు 54 ఉన్నాయి. వాటన్నింటినీ మించి అత్యాధునికంగా రోమియో హెలికాప్టర్లను తయారు చేస్తారు.. ఈ డీల్ కింద. శతృదేశాలకు చెందిన యుద్ధ నౌకల కదలికలను నిశితంగా పరిశీలించగలదని, అంతే సామర్థ్యంతో వాటి మీద దాడి చేయగల సత్తా రోమియో హెలికాప్టర్లకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చైనాపై నిఘా కోసమే..
చైనా నౌకాదళంపై నిఘాను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి రోమియో హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మధ్య కాలంలో చైనా నౌకాదళం దూకుడును ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. తరచూ భారత జలాల్లోకి ప్రవేశిస్తూ చికాకు పెడుతోందనే వాదనలు ఇటీవలి కాలం నుంచి తరచూ వినిపిస్తున్నాయి. చైనా నౌకాదళ కదలికలను పసిగట్టడానికే కేంద్ర ప్రభుత్వం రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు సిద్ధ పడిందని అంటున్నారు.