ఇట్స్ బీజేపీ టర్న్: రాత్రి 9 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ: వాంఖెడె స్టేడియంలో..!
ముంబై: ఇక భారతీయ జనతా పార్టీ వంత వచ్చింది. ఒకవంక- మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి క్యాంపు రాజకీయాలు జోరుగా కొనసాగుతుండగానే.. మరోవంక బీజేపీ కూడా ఇక హోటల్ రాజకీయాలకు తెర తీసింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టు ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో.. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
అయోధ్య తీర్పుపై వెనక్కి తగ్గిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు: రివ్యూ పిటీషన్ విషయంలో..!
గార్వర్ క్లబ్ లో.. 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు..
మంగళవారం రాత్రి 9 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలందరూ ముంబై వాంఖెడె స్టేడియంలోని గార్వర్ క్లబ్ లో సమావేశం కావాలని ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ శాసనసభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. లిఖితపూరకంగా లేఖలను పంపించారు. గార్వర్ క్లబ్ లో రాత్రి 9 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..
ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ మద్దతు ఇవ్వడంతో రాత్రికి రాత్రి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వ్యవహారంపై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మంగళవారం తీర్పును వినిపించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. బుధవారం అసెంబ్లీలోొ తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది.
145 మంది అవసరం ఉన్న చోట.. 105 మందే
ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ పార్టీకి శాసన సభలో 105 మంది సభ్యులు బలం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం అవుతుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ తనకు 54 మంది సభ్యుల బలం ఉందంటూ లేఖ ఇవ్వడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటైంది కూడా. ఇక బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఫడ్నవీస్ ప్రభుత్వానికి.
162 మందితో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్..
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాయకులు తమకు 162 బంది శాసన సభ్యుల బలం ఉందని సోమవారం రాత్రి హోటల్ గ్రాండ్ హయాత్ లో నిరూపించుకున్న విషయం తెలిసిందే. 162 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ ను ఏర్పాటు చేసింది. వారితో ప్రతిజ్ఞను చేయించింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి 162 మంది సభ్యుల బలం ఉందీ అంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ బీజేపీ వద్ద లేనట్టే. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.