ఉద్దవ్కు బలపరీక్ష: అజిత్ పవార్ను కలిసిన బీజేపీ నేత, మళ్లీ ఏమైనా ట్విస్టిస్తారా?
ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సర్కారు శనివారం బలపరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణం చేశారు.
అజిత్ పవార్తో బీజేపీ నేత భేటీ..
ఈ నేపథ్యంలో శనివారం నాందేడ్ బీజేపీ ఎంపీ ప్రతాప్ రావు చిఖిల్కర్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జరిగిన పరిణామాలను గమనిస్తే.. మళ్లీ ఏదైనా ట్విస్టిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అజిత్ పవార్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అంతేగాక, బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ప్రమాణం చేసి అందరికీ షాకిచ్చారు.
మద్దతు ఉందంటూ అజిత్ పవార్..
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడికి కుమారుడైన అజిత్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. తనకు 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ బీజేపీకి మద్దతు పలికారు. అయితే, 51 మంది ఎమ్మెల్యేలు తాము శరద్ పవార్ వెంటే ఉన్నామని ప్రకటించారు. దీంతో అజిత్ పవార్కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే మిగిలింది.
డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా.. మళ్లీ..
ఈ క్రమంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో చేసేదేం లేక ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత అజిత్ పవార్ మళ్లీ ఎన్సీపీ గూటికి చేరుకున్నారు. దీంతో ఆయన మద్దతుదారులు తాజా ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్కే ఇవ్వాలంటే మద్దతు పలుకుతున్నారు.
ఉద్ధవ్ థాక్రేకు బలపరీక్ష
ఉద్ధవ్ థాక్రే సర్కారుకు శనివారం అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. రెండు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు బలపరీక్ష జరగనుంది. తర్వాతి రోజు మంత్రులను సభకు పరిచయం చేయనున్నారు. ఆదివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపన్నారు.
162 మద్దతంటూ కూటమి..
కొత్తగా ఎంపికైన స్పీకర్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెం స్పీకర్గా నియమితులయ్యారు. ఆయనే శనివారం బలపరీక్ష నిర్వహించనున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 44 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
288 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందని కూటమి నేతలు చెప్పారు.