ప్రభుత్వం సిద్ధం: అఖిలపక్ష సమావేశంలో మోడీ, 20రోజులపాటు పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపత్యంలో ఆదివారం పార్లమెంటు లైబ్రరీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. జమ్మూకాశ్మీర్లో నిర్బంధంలో ఉన్న ఎంపీ ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంగా డిమాండ్ చేయడం గమనార్హం.
ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత పెరుగుదల, రైతాంగ సంక్షోభంపై విస్తృత చర్చ జరపాలని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి కోరారు. కాగా, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
ఈసారి కూడా సభ అత్యంత సమర్థంగా సాగాలని మోడీ ఆకాంక్షించారు. సభా నియమ, నిబంధనల ప్రకారం అన్ని రకాల అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. నిర్మాణాత్మక చర్చలు జరిగితే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచనలు చేయడంతో ఈ సమావేశం నిర్వహించారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు 20 రోజులపాటు ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశానికి మొత్తం 27 పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లట్, కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్, ఎంపీ ఆనంద్ శర్మ, టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రియన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి హాజరయ్యారు.