రాహుల్ లాంగ్ లీవ్పై డిగ్గీ సంచలనం, అవసరం లేదని వెంకయ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ శనివారం నాడు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సెలవు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సుదీర్ఘ సెలవు తీసుకొని తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
రాహుల్ సెలవు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆ సెలవును రాహుల్ గాంధీ పొడిగించడం తప్పని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో రాహుల్ గాంధీకి అప్పగించాక సోనియా గాంధీ పార్టీకి దూరం కావొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు... రాహుల్ గాంధీ సెలవు పైన తన దైన శైలిలో సెటైర్లు విసిరారు. రాహుల్ గాంధీ ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదని, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదని చురక అంటించారు. మోడీని ప్రజలు దైవదూతగా భావిస్తున్నారని చెప్పారు. మైనార్టీలు మెజార్టీగా ఉన్న జమ్ము కాశ్మీర్లో బీజేపీ జెండా ఎగిరిందన్నారు.