బావలూ! నేనొచ్చా!!: అన్నాడీఎంకేలో చేరిన నమిత
చెన్నై: ప్రముఖ సినీ నటి నమిత అన్నాడీఎంకే పార్టీలో చేరారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు నమిత శనివారం నాడు అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు జయలలిత సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.
శనివారం సాయంత్రం తిరుచ్చిలో జరిగిన బహిరంగ సభలో ఆమెకు జయలలిత పార్టీ సభ్యత్వం ఇచ్చారు. తనకు అన్నాడీఎంకే పార్టీలో చేరాలని ఉందని, ఆ మేరకు అవకాశం కల్పించాలని నమిత శుక్రవారం నాడు జయలలితకు లేఖ రాశారు.
అందుకు జయలలిత సుముఖత వ్యక్తం చేశారు. దీంతో తిరుచ్చి వెళ్లిన నమిత.. అక్కడ అన్నాడీఎంకే సభ్యత్వం తీసుకున్నారు. నమిత మాట్లాడుతూ.. జయలలిత తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని, పరిపాలన బాగుండటంతో తాను అన్నాడీఏంకేలో చేరుతున్నానని చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేస్తానన్నారు.
గత లోకసభ ఎన్నికల్లో బిజెపిలో చేరేందుకు నమిత ఉత్సాహం చూపించారు. అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మిన్నకుండిపోయారు. నమిత అభిమానులను మచ్చన్స్ (బావలు లేదా మరుదులు)గా పిలుస్తుంటారు. తెలుగహు, తమిళ చలనచిత్రాల్లో నటించిన నమితకు మంచి గుర్తింపు ఉంది.